తికమక బ్యాలెట్
ABN , Publish Date - May 09 , 2024 | 12:16 AM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో పని చేసే సిబ్బందికి ఓటు ఎక్కడ వేయాలో మూడు రోజుల పాటు అర్థం కాక తికమకపడ్డారు. ఈ నెల 6వ తేదీ మొదటి రోజు బీఆర్ అంబేడ్కర్ గురు కుల ఆశ్రమ పాఠశాలలో, రెండో రోజు తహశీల్దార్ కార్యాలయంలో, మూడో రోజు బీఆర్ అంబేడ్కర్ గురుకుల ఆశ్రమ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు.
గోపాలపురం, మే 8: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో పని చేసే సిబ్బందికి ఓటు ఎక్కడ వేయాలో మూడు రోజుల పాటు అర్థం కాక తికమకపడ్డారు. ఈ నెల 6వ తేదీ మొదటి రోజు బీఆర్ అంబేడ్కర్ గురు కుల ఆశ్రమ పాఠశాలలో, రెండో రోజు తహశీల్దార్ కార్యాలయంలో, మూడో రోజు బీఆర్ అంబేడ్కర్ గురుకుల ఆశ్రమ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. అయితే తమ ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకో వాలో అర్థం కాక పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు తికమకపడ్డారు. దీంతో తమ ఓటు ఎన్నికల్లో వినియోగించుకోలేమనే గందరగోళంలో ఉద్యోగులు ఉన్నారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అర్థం కాని పరిస్థితుల్లో ముగిసింది.
సొమ్మసిల్లిన అంగన్వాడీ టీచర్
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వెళ్ళిన సంజీవపురం గ్రామానికి చెందిన మడకం గంగారత్నం అంగన్వాడీ టీచర్ లైన్లో నిలబడి ఓటు వేసేందుకు దగ్గరకు వెళ్లి కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేఎల్ శివజ్యోతి ఆమె వద్దకు వచ్చి తన వాహనంలో సామాజికి ఆరోగ్య కేంద్రానికి పంపించారు. చికిత్స పొందిన అనంతరం గంగారత్నం మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వెళ్లి లైన్లో నిలబడ్డానని, ఓటు వేసేందుకు ఎక్కువ మంది రావడంతో నాలుగు లైన్లు కిక్కిరిసిపోయాయన్నారు. మధుమేహంతో బాధపడుతున్న తాను ఉక్కబోతకు గురై సొమ్మసిల్లి పడిపోయానని చెప్పారు.