Share News

Chilukaluripeta: మాజీ మంత్రి రజినీకి ఝలక్‌

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:14 AM

ప్రభుత్వం మారడంతో జగన్‌ హయాంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని రూ.1.16 కోట్ల కమిషన్‌ నొక్కేశారు.

Chilukaluripeta: మాజీ మంత్రి రజినీకి ఝలక్‌

  • ఇచ్చిన కమీషన్‌ వెనక్కి గుంజుకున్న రైతులు

  • గతంలో మాజీ మంత్రి రూ.1.16 కోట్లు నొక్కుడు

  • ప్రభుత్వం మారడంతో పోలీసులకు రైతుల ఫిర్యాదు

  • 90 లక్షలు తిరిగిచ్చిన రజిని.. నేడు మరో 26 లక్షలు

చిలకలూరిపేట, జూన్‌ 27: ప్రభుత్వం మారడంతో జగన్‌ హయాంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని రూ.1.16 కోట్ల కమిషన్‌ నొక్కేశారు. తాజాగా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ డబ్బు వసూలు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో విడదల రజిని రైతుల వద్ద కమీషన్‌గా తీసుకున్న డబ్బును గురువారం వెనక్కి ఇచ్చేశారు. గ్రామానికి చెందిన చిలకలూరిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ జాలాది సుబ్బారావు, రైతు నాయకుడు గడిపూడి దశరథ రామయ్యలు తెలిపిన వివరాలు ప్రకారం.. పసుమర్రుకు సమీపంలో ఉన్న గుదేవారిపాలెంలో సుమారు 200 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

మంత్రిగా రజిని హయాంలో 150 ఎకరాల భూసేకరణకు ఏర్పాటు చేశారు. ఇందులో 32 మంది రైతుల నుంచి 50 ఎకరాల భూసేకరణ చేశారు. అప్పట్లో ఎకరాకు రెండున్నర లక్షలు చొప్పున చిన్న చిన్న మినహాయింపులు పోను మొత్తం రూ.1.16 కోట్ల మొత్తాన్ని మంత్రి రజిని తన అనుచరుల ద్వారా ముక్కు పిండి వసూలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి కూడా ఈ విషయాన్ని తెచ్చారు. ఈ నేపథ్యంలో రజిని మనుషులు రైతులకు రూ.90 లక్షలు వెనక్కి ఇచ్చారు. మిగిలిన రూ.26 లక్షలు శుక్రవారం రైతులకు ఇచ్చే ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.


గోడ తొలగింపు

పసుమర్రు నుంచి జాతీయ రహదారి గుండా గొర్రెల మండి పక్కగా చిలకలూరిపేటకు వచ్చే మార్గంలో విడదల రజిని కుటుంబ సభ్యులు అడ్డంగా గోడ కట్టారు. ఆ మార్గంలో రాకపోకలకు వీలు లేకుండా చేశారు. దీంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీనిపై ఆ గ్రామవాసులు నిరసన తెలిపినప్పటికీ లెక్క చేయలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ గోడను రజిని కుటుంబ సభ్యులు తొలగించారు. ఆ మార్గంలో ఉన్న భూమిని తాము దానం చేస్తున్నట్లు పంచాయతీకి లిఖిత పూర్వకంగా తెలిపారు.

Updated Date - Jun 28 , 2024 | 04:14 AM