Share News

TDP : గుట్టువీడిన.. రాజకోట రహాస్యం !

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:55 AM

ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరుతో విశాఖలో కాపురమంటూ సీఎంగా ఉండగా జగన్‌ ఆర్భాటం చేశారు. కానీ, ఇదేదో సాదాసీదా కాపురం కాదు... రూ.500 కోట్లతో రుషికొండపై కట్టుకున్న ప్యాలెస్‌లో పెట్టాలనుకున్న అత్యంత ఖరీదైన కాపురం. ఫైవ్‌స్టార్‌ హోటల్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, టూరిజం ప్రాజెక్ట్‌, ఫేజ్‌ 1, 2 అంటూ కాకమ్మ కథలు చెప్పారు.

TDP : గుట్టువీడిన.. రాజకోట రహాస్యం !

  • రుషికొండపై రూ.500 కోట్లతో జగన్‌ జల్సా మహల్‌

  • మూడేళ్ల తర్వాత వెలుగులోకి ప్యాలెస్‌ చిత్రాలు

  • మీడియాతో కలిసి ప్యాలె్‌సలోకి టీడీపీ నేత గంటా

  • పర్యాటకుల పేరిట రాజభవనమే కట్టేశారని ధ్వజం

  • మార్బుల్‌, ఇంటీరియర్‌కే రూ.కోట్లలో వ్యయం

  • సద్దాం, గాలి భవనాలను తలదన్నేలా నిర్మాణాలు

  • నాడు ప్రజా వేదిక చట్ట విరుద్ధమని కూల్చిన జగన్‌

  • తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారు?

  • నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం: గంటా

  • ప్యాలెస్‌లో 3 బ్లాకులు జగన్‌ ఫ్యామిలీకే

  • భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌.. కుమార్తెలకు చెరోటి

చేయి వేస్తే మాసిపోయేంత వర్ణఛాయలో ఇటాలియన్‌ మార్బుల్‌ గోడలు.. ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌తో బాత్రూమ్‌ ఫిటింగ్స్‌.. ఒళ్లు పట్టించుకోవడానికి మసాజ్‌ (స్పా) రూమ్‌.. సమావేశ మందిరం సైజులో పడక గదులు.. 300 మంది గుంపుగా వచ్చినా ఒకరికి ఒకరు తగలకుండా ఉండేంత విశాలమైన కారిడార్లు.. 200 మందితో సమావేశం నిర్వహించడానికి అవసరమైన గదులు.. ముఖ్యమైన ఫైళ్లు భద్రపరచడానికి లాకర్లు.. ప్రభుత్వ నిధులతో వ్యక్తిగత వినియోగానికి ఘనుడు జగన్‌ కట్టుకున్న విలాసవంతమైన భవనంలో ఆదివారం కనిపించిన దృశ్యాలివి. నిర్మించిన ఏడు బ్లాకుల్లో మూడు జగన్‌ వ్యక్తిగత వినియోగం కోసం కట్టుకున్నారు. అందులో ఒకటి జగన్‌ దంపతులకు.. దాని పేరు ప్రెసిడెన్షియల్‌ సూట్‌. ఇంకో రెండు.. విల్లా సూట్స్‌. ఆ రెండూ కుమార్తెల కోసం చెరొకటి నిర్మించారు. మిగిలిన నాలుగింటికి కాసింత దూరంగా, ప్రత్యేకంగా సముద్రానికి అభిముఖంగా వీటిని నిర్మించారు. ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేశారు!

ఈ నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం: గంటా

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరుతో విశాఖలో కాపురమంటూ సీఎంగా ఉండగా జగన్‌ ఆర్భాటం చేశారు. కానీ, ఇదేదో సాదాసీదా కాపురం కాదు... రూ.500 కోట్లతో రుషికొండపై కట్టుకున్న ప్యాలెస్‌లో పెట్టాలనుకున్న అత్యంత ఖరీదైన కాపురం. ఫైవ్‌స్టార్‌ హోటల్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, టూరిజం ప్రాజెక్ట్‌, ఫేజ్‌ 1, 2 అంటూ కాకమ్మ కథలు చెప్పారు. కానీ, చివరకు రాజ భవనాన్నే కట్టేసుకున్నారు. ప్రజలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ ఊదరగొట్టిన జగన్‌, ఆ ప్రజల సొమ్ముతో జల్సా మహల్‌నుఏర్పాటుచేసుకున్నారు. పైగా ఆ ఛాయలకు కూడా ప్రజలను కానీయలేదు.


కేసులు పెట్టించి జైల్లో వేయించారు. ఎన్నికల్లో జగన్‌ ఓడిపోవడంతో ఇప్పుడు ఈ విలాసవంతమైన భవనాలు ప్రభుత్వానికి మిగిలాయి. ఈ భవనంలో వాడిని టైల్స్‌ ఒక్కో చదరపు అడుగు ధర రూ.26,000గా చెప్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి, భీమిలీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. విశాఖ రుషికొండపై నిర్మాణాలు పూర్తి చేసుకున్న ‘జగన్‌’ ప్యాలెస్‌ లోపల అడుగుపెట్టారు. అక్కడి విలాసం చూసి ఆయన, మీడియాలో ప్యాలెస్‌ హంగులు చూసి జనమూ అవాక్కయ్యారు. అనంతరం ప్యాలెస్‌లోని రెండో బ్లాక్‌లో గంటా మిగతా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....

ప్రజాస్వామ్యంలో కూడని నిర్మాణాలివి..

‘‘‘ప్రజాస్వామ్యంలో ఈ తరహా నిర్మాణాలు ఎక్కడా చూడలేదు. రూ.91 కోట్లతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మిస్తామని చెప్పి.. ఏకంగా రాజ భవనాన్నే నిర్మించుకున్నారు. అప్పట్లో ప్రభుత్వం చెప్పినట్టు.. పర్యావరణ రిసార్ట్స్‌కు సంబంధించిన ఛాయలేవీ కనిపించడం లేదు. పర్యాటకుల కోసం దీనిని కడితే రాత్రికి వారు బస చేయడానికి గదులు ఉండాలి. అవి ఒక్కొక్కటి 300 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. ఆ సైజులో ఇక్కడి ప్యాలెస్‌లోని ఒక్క రూమ్‌ కూడా లేదు. బాత్రూమ్‌ కూడా బెడ్‌రూమ్‌ సైజులో ఉంది. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను మించిపోయే వసతులు ఉన్నాయి. రూ.500 కోట్లతో సాగించిన ఈ ప్యాలెస్‌లో ఒక్కో హాల్‌, మార్బుల్‌, ఫర్నిచర్‌ ఇరాక్‌ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌, కర్ణాటకకు చెందిన గనుల వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డి వంటి వారు నిర్మించిన భవనాలను తలదన్నేలా ఉన్నాయి. ఎంతో మోజుపడి కట్టించుకున్న భవనంలోకి అడుగుపెట్టకుండానే జగన్‌ అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది’’


నాడు విపక్ష నేతలను ప్యాలెస్‌లోకి పోనీయలేదు..

‘‘నాడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను ప్యాలెస్‌ వద్దకు వెళ్లనీయకుండా గతంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎంతో మందిపై కేసులు కూడా పెట్టారు. ఈ ప్యాలెస్‌ను అప్పటి పర్యాటకశాఖ మంత్రి రోజా ప్రారంభించి వెళ్లిపోయారు. సాధారణంగా ప్రభుత్వం ఏదైనానిర్మించినప్పుడు అది ఎందుకు కడుతున్నదీ డ్రాయింగ్స్‌తో సహా డిస్‌ప్లే చేస్తారు. కానీ, దానికిభిన్నంగా అత్యంతరహస్యంగా ఎందుకు చేపట్టా రు?’’

అనుయాయులకు నిర్మాణ పనులు....

‘‘రుషికొండపై మొత్తం 61 ఎకరాలు ఉండగా, 9.8 ఎకరాల్లో నిర్మాణాలు సాగించారు. పాత భవనాల కూల్చివేతకు, ల్యాండ్‌ స్కేపింగ్‌కు టెండర్లు పిలుస్తారు. కానీ, అందుకు విరుద్ధంగా వైసీపీ నాయకులకు పనులు కట్టబెట్టారు. అంతకుముందు ఉన్న హరిత రిసార్ట్‌ వల్ల ఏడాదికి ఎనిమిది కోట్లు ఆదాయం వచ్చేది. దానిని కూల్చివేయడం వల్ల ప్రభుత్వానికి ఆ ఆదాయం పోయింది. 20 అడుగుల ఎత్తులో బారికేడ్లు పెట్టి మరీ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ నిర్మాణాన్ని ఏం చేయాలన్న దానిపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు.’’ అని గంటా వివరించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా జగన్‌ ఐదేళ్లు పాలన సాగించారని ఆయన ధ్వజమెత్తారు.

Updated Date - Jun 17 , 2024 | 05:37 AM