Share News

AP News: ఏపీ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చర్చించిన అంశాలు ఇవే..

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:17 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేశారు. ఐదు రోజులపాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

AP News: ఏపీ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చర్చించిన అంశాలు ఇవే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేశారు. ఐదు రోజులపాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దీనికి పవన్ కల్యాణ్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి కీలక సూచనలు చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లొద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని సీఎం తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై తగిన చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అసెంబ్లీలో జగన్ ఆందోళన సైతం ప్రస్తావనకు వచ్చింది. సభలో జగన్, వైసీపీ తీరును ఎన్డీఏ శాసనసభాపక్షం తప్పుపట్టింది. కూటమిలోని మూడు పార్టీల మధ్య కో-ఆర్డినేషన్ అంశాన్ని పౌరసరఫరా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావనకు తెచ్చారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తాను, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.." శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తన, మన అనే విషయాన్ని కూడా చూడను. వైసీపీ హయాంలో నన్నే జైలుకు పంపారు. కక్ష సాధింపు చేయాలనుకుంటే నేనూ చేయగలను. కానీ కక్ష సాధింపు వ్యవహారాన్ని నేను పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలూ కక్ష పూరితంగా వ్యవహరించొద్దు. రాజకీయ ప్రతీకారాలకు పోవద్దు. శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లొద్దు. ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తాం. ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. ప్రభుత్వం వచ్చి నెల రోజుల కాలేదు.. అప్పుడే జగన్ విమర్శలు మొదలు పెట్టేశారు. ఆయన తన సహజ ధోరణి వీడలేదు.


గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజునే అడ్డుకోవడం కరెక్టేనా?. తప్పులు చేయడం.. పక్క వారిపై నెట్టేయడం ఆయనకు అలవాటుగా మారింది. వైఎస్ వివేకా హత్య కేసును వేరే వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేశారు. వినుకొండలో హత్య కేసులోనూ ఇదే జరుగుతోంది. గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పని చేయడం మానేశాయనడానికి మదనపల్లె ఘటనే నిదర్శనం. అర్థరాత్రి ప్రమాదం జరిగితే మర్నాడు వరకూ జిల్లా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సరిగా స్పందించలేదు. నిధులు లేవని పనులు చేయలేం అని చెప్పలేం. నిధుల విషయంలో ఇబ్బందులున్నా పనులు చేయాలి. ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదాం" అని చెప్పారు.

Updated Date - Jul 22 , 2024 | 05:22 PM