గృహాల వద్దనే ఓటింగ్ ప్రారంభం
ABN , Publish Date - May 09 , 2024 | 02:06 AM
ఎన్నికల సంఘం 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు, 40శాతం వైకల్యం కలిగిన వికలాంగులు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు కల్పించిన సదుపాయాన్ని మండలంలోని వృద్ధ, వికలాంగ ఓటర్లు సద్వినియోగం చేసుకున్నారు.
యడ్లపాడు, మే 8: ఎన్నికల సంఘం 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు, 40శాతం వైకల్యం కలిగిన వికలాంగులు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు కల్పించిన సదుపాయాన్ని మండలంలోని వృద్ధ, వికలాంగ ఓటర్లు సద్వినియోగం చేసుకున్నారు. మండలంలో 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు 21మంది, 40శాతం పైగా వైకల్యం కలిగిన వికలాంగ ఓటర్లు 15మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిలో భాగంగా ఎన్నికల అధికారులు నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారం తొలుత మండలంలోని తిమ్మాపురంలో అనంతరం యడ్లపాడు, మైదవోలు, లింగారావుపాలెం గ్రామాల్లో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి విడివిడిగా బ్యాలెట్ పేపర్లను అందించి వారు గుర్తించిన అనంతరం కవర్లో సీల్వేసి ఓటర్లచేత బ్యాలెట్ బాక్సులలో వేయించారు. తొలిరోజు నిర్వహించిన ఈ ప్రక్రియలో 11మంది వృద్ధులు, 8మంది దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం కూడా ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందని ఏఈఆర్వో, తహసీల్దార్ ఆష్రఫున్సీసా బేగం తెలిపారు.