Share News

Pinnelli Ramakrishna: ‘పిన్నెల్లి’ దాగుడుమూతలు..

ABN , Publish Date - May 24 , 2024 | 11:18 AM

ఈవీఎం బద్దలుకొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. ‘పరారీ’లో ఉన్న ఆయన ముందస్తు బెయిలు కోసం గురువారం హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు ఆయనకు భారీ ఊరట కలిగించింది. ఫలితాలు వెలువడి, కోడ్‌ ముగిసేదాకా...

Pinnelli Ramakrishna: ‘పిన్నెల్లి’ దాగుడుమూతలు..
Pinnelli Ramakrishna

ఈవీఎం బద్దలుకొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. ‘పరారీ’లో ఉన్న ఆయన ముందస్తు బెయిలు కోసం గురువారం హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు ఆయనకు భారీ ఊరట కలిగించింది. ఫలితాలు వెలువడి, కోడ్‌ ముగిసేదాకా... అంటే జూన్‌ 6వ తేదీ వరకు ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈసీ సీరియస్‌, ప్రత్యేక బలగాల గాలింపుతో ‘పరారీ’లో ఉన్న పిన్నెల్లికి ఇది భారీ ఊరటే. ఇక... వివిధ కేసుల్లో ముందస్తు బెయిలు కోరిన అభ్యర్థులందరికీ 6వ తేదీ దాకా అరెస్టులనుంచి హైకోర్టు ఉపశమనం కల్పించింది.

నరసరావుపేట, మే 24 : పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన పట్టుకునేందుకు వరుసగా రెండోరోజు కూడా పోలీసుల వేట కొనసాగింది. ఒక దశలో పిన్నెల్లి పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని సోషల్‌ మీడియా ప్రచారం జరిగింది. దీంతో కోర్టు వద్ద పోలీసులు మోహరించారు. అయినా, పిన్నెల్లి అచూకీ పోలీసులకు లభించలేదు. ఆయనను అరెస్టు చేశారని వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు. పిన్నెల్లి భారీ హింసను పాల్పడిన పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహించిన పీవో, ఏపీవోలను ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. మరోవైపు పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరిపైనా వచ్చే నెల ఆరో తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు గురువారం రాత్రి ఆదేశాలు జారీచేసింది.


ఈ నెల 13న పోలింగ్‌ రోజున మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి చెలరేగిపోయారు. అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని.. తనకు ఓట్లు వేయడం లేదన్న అక్కసుతో బరితెగించారు. పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించి.. ఈవీఎంను ఎత్తి నేలకేసికొట్టారు. 14వ తేదీన మాచర్లలోని తన ఇంటి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో హౌస్‌ అరెస్టులో ఉన్న ఆయన తప్పించుకునేందుకు పోలీసులు సహకరించారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈవీఎంను పగలగొట్టిన వ్యవహారాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుని ఆయన అరెస్టునకు ఆదేశించింది. దీంతో పోలీసులకు దొరక్కుండా హైదరాబాద్‌, ఆ చుట్టుపక్కల జిల్లాల్లో పిన్నెల్లి సోదరులు షెల్టర్‌ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.


మరోవైపు సోదరులిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారనే వార్తలు వినవస్తున్నాయి. వారిద్దరూ తమిళనాడులో తల దాచుకుంటున్నారనే వదంతులూ వ్యాపించాయి. అడిషనల్‌ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల నాయకత్వంలోని ఎనిమిది బృందాలు.. పిన్నెల్లి సోదరుల కోసం గాలిస్తున్నాయి. కాగా, ఈవీఎంల ధ్వంసం, పోలింగ్‌ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించిన వారిపై చర్యల కోసం సీసీటీవీ పుటేజీని పోలింగ్‌ జరిగిన మర్నాడే పోలీసులకు అందజేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించడం సంచలనం కలిగించింది. సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం హుటాహుటిన స్పందించి.. ఎమ్మెల్యే పేరును నిందితుల జాబితాలో చేర్చేలా చేయగలిగింది. లేదంటే నిజాన్ని సమాధి చేసేవారని, ఎమ్మెల్యే పారిపోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదన్న విమర్శలొస్తున్నాయి.


కాగా, గురువారం పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం సమయంలో పోలింగ్‌ కేంద్రంలో ఉన్న పీవో తన డైరీలో జరిగిన ఘటన నమోదు చేసినప్పటికీ, పిన్నెల్లి పేరు నమోదు చేయలేదని చెబుతున్నారు. ఆర్వో (జేసీ) శ్యామ్‌ప్రసాద్‌ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి ఈవీఎంలను పునరుద్ధరించారు. అయితే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన అంశాన్ని తన నివేదికలో పేర్కొనలేదని సమాచారం.

For More Andhra Pradesh News and Telugu News

Updated Date - May 24 , 2024 | 11:18 AM