Share News

నన్నపనేని చేరికతో కంచికచర్లలో టీడీపీకి మరింత బలం

ABN , Publish Date - May 09 , 2024 | 01:31 AM

కంచికచర్ల ప్రాంతంలో ఆర్థిక, అంగబలంతో పాటు పలుకుబడి కల్గిన పట్టణానికి చెందిన సీనియర్‌ నాయకుడు వైసీపీ మండల కన్వీనర్‌ నన్నపనేని నరసింహా రావు బుధవారం టీడీపీలో చేరారు.

నన్నపనేని చేరికతో కంచికచర్లలో టీడీపీకి మరింత బలం
నన్నపనేని నరసింహారావును పార్టీలోకి ఆహ్వానిస్తున్న సౌమ్య

కంచికచర్ల: కంచికచర్ల ప్రాంతంలో ఆర్థిక, అంగబలంతో పాటు పలుకుబడి కల్గిన పట్టణానికి చెందిన సీనియర్‌ నాయకుడు వైసీపీ మండల కన్వీనర్‌ నన్నపనేని నరసింహా రావు బుధవారం టీడీపీలో చేరారు. దీంతో టీడీపీకి మరింత బలం చేకూరుతుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. సొసైటీ అధ్యక్షునిగా, మండల పరిషత్‌ సభ్యుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు. వైసీపీలో సరైన గుర్తింపు లేకపోవటంతో కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీని వీడుతున్నారని సమాచారం తెలియగానే ఆ పార్టీ నందిగామ అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, ఇతర నాయకులు స్వయంగా నన్నపనేని ఇంటికి వెళ్లి బుజ్జగించినా బుధవారం కేశినేని చిన్ని సమక్షంలో విజయవాడ వెళ్లి టీడీపీలో చేరారు. నందిగామ వచ్చి కూటమి నందిగామ అభ్యర్థి తంగిరాల సౌమ్యను కలిశారు. పార్టీ కండువా కప్పి సౌమ్య ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. నరసింహారావు అనుచరవర్గమం తా రెండు రోజుల్లో టీడీపీలో చేరనుంది.

Updated Date - May 09 , 2024 | 01:31 AM