అలరించిన నిత్య కళారాధన
ABN , Publish Date - May 09 , 2024 | 12:37 AM
శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో బుధవారం హైదరాబాద్కు చెందిన దత్తకూచిపూడి నాట్యమండలి బృందంతో సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
శ్రీశైలం, మే 8: శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో బుధవారం హైదరాబాద్కు చెందిన దత్తకూచిపూడి నాట్యమండలి బృందంతో సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో శ్రీశైలం శివమయం, కరుణించరా, శివ శివ శంకరా, శంభో శంభో, లింగాష్టకం తదితర గీతాలకు కళాకారులు నృత్య ప్రదర్శనతో అలరించారు.
సాక్షి గణపతికి విశేష అభిషేకం
శ్రీశైలం మహాక్షేత్రంలో లోకల్యాణం కోసం బుధవారం ఉదయం సాక్షి గణపతి స్వామికి విశేష అభిషేకం, పూజలు నిర్వహించారు. అభిషేకాన్ని పంచామృతాలతోనూ, పలుఫలోదకాలతోనూ, హరిద్రోదకం, కలశోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో అభిషేకాన్ని జరిపి మహా మంగళ హారతులను సమర్పించారు.
జ్వాలా వీరభద్రస్వామికి పూజలు
శ్రీశైలం క్షేత్రంలో లోక కల్యాణం కోసం మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలో ఉత్తరభాగంలో ఉన్నటువంటి జ్వాలావీరభద్ర స్వామికి ప్రదోష కాలంలో విశేష అభిషేకం, పూజలు నిర్వహించింది. స్వామికి పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్దజలాలతో అభిషేకం నిర్వహించారు.