Share News

TDP-Janasena: సమన్వయ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం.. ఈ నెల 28న..

ABN , Publish Date - Feb 22 , 2024 | 06:42 PM

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ జనసేన పార్టీ గురువారం నిర్వహించిన ‘సమన్వయ కమిటీ సమావేశం’లో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. పొత్తును స్వాగతించిన టీడీపీ - జనసేన కేడర్‌ను అభినందిస్తూ ఒక తీర్మానం.. మీడియాపై దాడులను తప్పుపడుతూ రెండవ తీర్మానాన్ని సమన్వయ కమిటీ ఆమోదించింది. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వివరాలను వెల్లడించారు. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉమ్మడి సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

TDP-Janasena: సమన్వయ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం.. ఈ నెల 28న..

అమరావతి: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ జనసేన పార్టీ గురువారం నిర్వహించిన ‘సమన్వయ కమిటీ సమావేశం’లో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. పొత్తును స్వాగతించిన టీడీపీ - జనసేన కేడర్‌ను అభినందిస్తూ ఒక తీర్మానం.. మీడియాపై దాడులను తప్పుపడుతూ రెండవ తీర్మానాన్ని సమన్వయ కమిటీ ఆమోదించింది.

ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వివరాలను వెల్లడించారు. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉమ్మడి సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందని, త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు-జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.


క్షేత్ర స్థాయిలో టీడీపీ - జనసేన మధ్య గ్యాప్ లేకుండా పని చేయాలని ఇరుపార్టీల కేడర్‌కు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. టీడీపీ - జనసేన మధ్య వైసీపీ తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోందని, ప్రజల మధ్యన కూడా జగన్ తగవులు పెడతున్నారని ఆరోపించారు. జగన్ అంత వరస్ట్ సీఎంను ఇప్పటివరకు చూడలేదని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని, ఏపీలో స్వేచ్ఛ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం సీఎం జగన్ తిరిగి అధికారంలోకి రాకూడదనే ఏకైక లక్ష్యంతో పొత్తు పెట్టుకున్నామని, తాడేపల్లి గూడెంలో జరిగే ఉమ్మడి సభకు 6 లక్షల మంది వస్తారనే అంచనాతో సభకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.


ఎన్డీఏలోకి ఆహ్వానంపై..

టీడీపీని ఎన్డీఏలో ఆహ్వానించారని, ఈ మేరకు జరిగిన చర్చల విషయంలో త్వరలో క్లారిటీ వస్తుందని, ఇందులో దాపరికం ఏమీ లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. పొత్తులు పెట్టుకునే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవని అధినేతలిద్దరూ చెప్పారని అన్నారు. టిక్కెట్లు కొల్పోయిన వాళ్లు బాధ పడొద్దని చంద్రబాబు, పవన్ చెబుతూనే ఉన్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ఇక వలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేశామని, వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఈసీ చెబుతోంటే.. ధర్మాన దానికి విరుద్దంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశ్యంతో పొత్తులు: నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్

ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశ్యంతో పొత్తులు పెట్టుకున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సమన్వయం లోపం లేకుండా రెండు పార్టీలు ఎన్నికలు వెళ్లబోతున్నాయని అన్నారు. టీడీపీ - జనసేన పార్టీలు కలిసి పని చేయాల్సి ఉంటుందని, అవసరమైతే త్యాగాలు కూడా చేయక తప్పదని చంద్రబాబు - పవన్ సూచిస్తున్నారని ప్రస్తావించారు. ఈ నెల 28వ తేదీన జరిగే సభ ఉమ్మడి సభలో రెండు పార్టీల నేతలు పాల్గొంటారని, ‘బై బై వైసీపీ’ అనేది ఓ నినాదంగా మారాలని కేడర్‌కు సూచించారు. రెండు నెలల్లో వైసీపీ విముక్త రాష్ట్రంగా మారుతుందని నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు. యువత, మహిళలు, రైతులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపొందిస్తామని, అభ్యర్థుల విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని తెలిపారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Updated Date - Feb 22 , 2024 | 06:53 PM