Share News

TDP:విధ్వంస పాలనకు ప్రతీకగా‘ప్రజావేదిక’!

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:55 AM

జగన్‌ ప్రభుత్వ విధ్వంస పాలనకు ప్రతీకగా ‘ప్రజావేదిక’ శిథిలాలను అలాగే ఉంచాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. సరిగ్గా ఐదేళ్ల కిందట జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రజా వేదికను బుల్‌డోజర్లు, పొక్లెయిన్లతో జగన్‌ కూలగొట్టించిన విషయం తెలిసిందే.

TDP:విధ్వంస పాలనకు ప్రతీకగా‘ప్రజావేదిక’!

శిథిలాలు అలాగే ఉంచాలని చంద్రబాబు నిర్ణయం

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వ విధ్వంస పాలనకు ప్రతీకగా ‘ప్రజావేదిక’ శిథిలాలను అలాగే ఉంచాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. సరిగ్గా ఐదేళ్ల కిందట జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రజా వేదికను బుల్‌డోజర్లు, పొక్లెయిన్లతో జగన్‌ కూలగొట్టించిన విషయం తెలిసిందే. ఈ వేదిక అమరావతి పరిధిలో సీఎం చంద్రబాబు నివాసానికి పక్కనే ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం అమరావతిలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రభుత్వపరమైన సమావేశాల నిర్వహణకు అనువైన సమావేశ మందిరం ఉండాలన్న ఉద్దేశంతో ఉండవల్లి కరకట్ట పక్కన ‘ప్రజావేదిక’ పేరుతో సమావేశ మందిరాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. అయితే ఎన్నికల్లో గెలిచిన వైసీపీ 2019 జూన్‌ 26న అందులో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ముంపు ప్రాంతంలో నిర్మించినందువల్ల ఈ సభా మందిరాన్ని కూల్చి వేస్తున్నామని ఆ సమావేశంలోనే సీఎం హోదాలో జగన్‌ ప్రకటించారు. కలెక్టర్ల సమావేశం ముగియగానే రాత్రికి రాత్రి బుల్‌డోజర్లు, పొక్లెయిన్లతో కూలగొట్టి ఉదయానికల్లా దానిని శిథిలాల కుప్పగా మార్చారు. సీఎం చంద్రబాబు శనివారం సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిఽధులతో ముచ్చటిస్తున్నప్పుడు ఈ శిథిలాల ప్రస్తావన వచ్చింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ‘మేం ఆ శిథిలాలను తొలగించం. భవిష్యత్తులో కూడా ఆ శిథిలాలు చూస్తే అందరికీ వైసీపీ విధ్వంస పాలన గుర్తుకు రావాలి’ అని స్పష్టం చేశారు.

Updated Date - Jun 16 , 2024 | 04:55 AM