Share News

Vangalapudi Anita : గంజాయి ఆచూకీ చెబితే బహుమతి

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:16 AM

‘గంజాయి ఆచూకీ చెప్పి పట్టించిన వారికి ప్రభుత్వం తరఫున రివార్డ్‌ అందిస్తాం. అందుకు అవసరమైన టోల్‌ ఫ్రీ నంబరును 10 రోజుల్లో ఏర్పాటు చేసి ప్రకటిస్తాం’ అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

Vangalapudi Anita : గంజాయి ఆచూకీ చెబితే బహుమతి

  • 10 రోజుల్లో అందుబాటులోకి టోల్‌ ఫ్రీ

  • ఐజీ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

  • మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలిస్తాం

  • అమాయక గిరిజనులు 80ు జైల్లో

  • అసలైన స్మగ్లర్లకు ఉచ్చు: హోం మంత్రి

  • గంజాయి ఆచూకీ చెపితే రివార్డ్‌

  • 10 రోజుల్లో అందుబాటులోకి టోల్‌ ఫ్రీ: హోం మంత్రి అనిత

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ‘గంజాయి ఆచూకీ చెప్పి పట్టించిన వారికి ప్రభుత్వం తరఫున రివార్డ్‌ అందిస్తాం. అందుకు అవసరమైన టోల్‌ ఫ్రీ నంబరును 10 రోజుల్లో ఏర్పాటు చేసి ప్రకటిస్తాం’ అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆమె నేతృత్వంలో విద్య, వైద్యం, గిరిజన సంక్షేమం, ఎక్సైజ్‌ మంత్రులతో ఏర్పాటయిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం ఏపీ సచివాలయంలో గురువారం జరిగింది. ఆ శాఖల అఽధికారులతో చర్చించింది. తీసుకున్న కీలక నిర్ణయాలను హోం మంత్రి అనిత మీడియాకు వివరించారు. ‘రాష్ట్రం గడిచిన ఐదేళ్లలో గంజాయి రాజధానిగా మారింది.

పాఠశాల విద్యార్థుల పుస్తకాల సంచిలో గంజాయి ప్యాకెట్లు లభించడం తల్లితండ్రులను కలవరానికి గురి చేసింది. రాష్ట్రమంతా విస్తరిస్తోన్న ఈ మహమ్మారిని ప్రజల సహకారంతో పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుంది. గంజాయి మొక్కను పునాదుల నుంచి పీకేస్తాం. గిరిజనుల్ని ప్రలోభ పెడుతోన్న బడా వ్యాపారులకు ఉచ్చు బిగిస్తాం. మత్తు బారిన పడుతోన్న బాలలు, యువతకు ఉపశమనం కల్పిస్తాం. గంజాయి సాగు, సరపరా కట్టడికి యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఏటీఎన్‌ఎస్‌) ఏర్పాటు చేస్తున్నాం.


సెబ్‌ ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం రెండేళ్లపాటు ఎలాంటి అధికారాలూ ఇవ్వకుండా చేతులు కట్టేసింది. అరకు, పాడేరు ప్రాంతాల్లోని 11 మండలాల్లో సుమారు ఐదు వేల హెక్టార్లలో గంజాయి సాగవుతున్నట్లు అంచనా. విశాఖపట్నం జైల్లో 11 నెలలుగా 80 శాతం గిరిజన యువకులు, బాలలు గంజాయి కేసుల్లో మగ్గిపోతున్నారు. జైళ్లలోనే మరిన్ని డీ అడిక్షన్‌ సెంటర్లు పెడతాం.

గిరిజనులను కాఫీ, మిరియాలు, అల్లం, పసుపు లాంటి వాణిజ్య పంటల సాగువైపు మళ్లించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు, కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కట్టడి చేస్తాం’ అని అనిత ప్రకటించారు. హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేశ్‌, మంత్రులు సత్య కుమార్‌, కొల్లు రవీంద్ర గుమ్మడి సంధ్యారాణి పలు సూచనలు చేశారు. డీజీపీ ద్వారకా తిరుమల రావు, సెబ్‌ కమిషనర్‌ రవి ప్రకాశ్‌ ప్రస్తుత పరిస్థితులను మంత్రులకు వివరించారు.

Updated Date - Jul 05 , 2024 | 03:16 AM