జిల్లాలో ఇద్దరికి పాలీసెట్లో స్టేట్ ఫస్టు ర్యాంక్
ABN , Publish Date - May 09 , 2024 | 01:16 AM
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష (పాలీసెట్)లో అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు స్టేట్ ఫస్టు ర్యాంక్ సాధించారు. గత నెలలో ఈ పరీక్ష నిర్వహించగా, ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన పోతల జ్ఞాన హర్షిత, పాయకరావుపేటకు చెందిన శీలం శ్రీరామ్ భవదీప్ 120 మార్కులకుగాను 120 మార్కులు సాధించారు.
- చీడికాడ మండలం తురువోలు విద్యార్థిని జ్ఞాన హర్షిత, పాయకరావుపేట విద్యార్థి శ్రీరామ్ భవదీప్కు 120కి 120 మార్కులు
చీడికాడ, మే 8: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష (పాలీసెట్)లో అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు స్టేట్ ఫస్టు ర్యాంక్ సాధించారు. గత నెలలో ఈ పరీక్ష నిర్వహించగా, ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన పోతల జ్ఞాన హర్షిత, పాయకరావుపేటకు చెందిన శీలం శ్రీరామ్ భవదీప్ 120 మార్కులకుగాను 120 మార్కులు సాధించారు. జ్ఞాన హర్షిత ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చోడవరం పాఠశాలలో, ఆరు నుంచి పదో తరగతి వరకూ విశాఖలోని నారాయణ స్కూల్లో చదువుకుంది. ఈమె తల్లిదండ్రులు పోతల అప్పలనాయుడు, ప్రగతి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రస్తుతం వీరి కుటుంబం విశాఖపట్నంలో నివాసం ఉంటున్నది. ఈ సందర్భంగా జ్ఞానహర్షిత విలేకరులతో మాట్లాడుతూ పదో తరగతి మార్కుల ఆధారంగా ట్రిబుల్ ఐటీలో చేరాలనుకుంటున్నట్టు చెప్పింది. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన హర్షితను పలువురు అభినందించారు. కాగా పాయకరావుపేట లింగాలతోటకాలనీలో నివాసముంటున్న శీలం శ్రీను కుమారుడు శ్రీరామ్ భవదీప్ సంగివలస విద్యా సంస్థల్లో చదువుతున్నాడు. శ్రీరామ్ తండ్రి కాకినాడ జిల్లా అన్నవరం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుండగా, తల్లి ఫణిశ్రీ గృహిణి. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఐఐటీలో సీటు సాధించి ఇంజనీరింగ్ చదవాలన్నది తన లక్ష్యమని తెలిపాడు.