హోం మంత్రి రాజకీయ కుట్ర
ABN , Publish Date - May 09 , 2024 | 12:11 AM
కూటమి అభ్యర్థులకు వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక పోలీసులను అడ్డుపెట్టుకుని హోం మంత్రి తానేటి వనిత రాజకీయ కుట్రకు పాల్పడిందని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు.
నల్లజర్లలో టీడీపీ నాయకుడిపై దాడి
మంత్రిపై దాడి చేశారంటూ తిరిగి మాపైనే హత్యాయత్నం కేసు
ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి
నల్లజర్ల, మే 8: కూటమి అభ్యర్థులకు వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక పోలీసులను అడ్డుపెట్టుకుని హోం మంత్రి తానేటి వనిత రాజకీయ కుట్రకు పాల్పడిందని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. మంగళవారం రాత్రి వైసీపీ మూకలు చేసిన దాడిపై బుధవారం బాపిరాజు నివాసం వద్ద వారు విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 30 మంది పోలీసులు ఉండగా 50 మంది వైసీపీ మూకలు బాపిరాజు ఇంటి వద్ద గొడవ చేసేందుకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు.పోలీసుల వైఫల్యం వల్లే గొడవలు జరిగాయని ఆరోపించారు. తమపై హత్యాయత్నం కేసు నమోదు చేయించడం రాజకీయ కుట్ర అన్నారు.
ఇదీ వివాదం..
మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వైసీపీ మూకలు నల్లజర్లలో ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద బైక్ సైలెన్సర్లు తీసేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రాత్రి 10 గంటల తరువాత ప్రచారం ముగించాలని ఎందుకు కావాలని సౌండ్ చేస్తున్నారని అక్కడ ఉన్న వారు మందలించగా వారు వెళ్లి మరో 30 మందితో వచ్చి గొడవకు దిగారు. ఈ క్రమంలో ప్రచారం ముగించుకుని ఇంటికి వస్తున్న బాపిరాజు వారిని వారించి వెళ్లిపోవాలని కోరారు. గొడవలు ఎందుకని సర్దిచెప్పేందుకు టీడీపీ నాయకుడు ఆలపాటి రామకృష్ణ మరి కొంతమంది వైసీపీ నాయకుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి మాట్లాడుతున్న సమయంలో కురిపితో రామకృష్ణ తలపై బలంగా కొట్టారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముళ్లపూడి బాపిరాజు, మద్దిపాటి వెంకట్రాజుకు చెప్పడంతో వెంటనే సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు. కోపంతో బాపిరాజు అనుచరులు అక్కడున్న కుర్చీలు విసిరేశారు. అయితే ఈ సమయంలో హోం మంత్రి అసలు నల్ల జర్లలో లేకపోయిప్పటకీ తనపై దాడి చేయడానికి వచ్చారని సెక్షన్ 307 పెట్టించినట్టు బాపిరాజు పేర్కొన్నారు. హోం మంత్రి, పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడబోమని ప్రజల్లో తెల్చుకుంటామని చెప్పారు. జనసేన కన్వీనర్ సువర్ణరాజు, పసుమర్తి రతీష్, యద్దనపూడి బ్రహ్మరాజు, ఆండ్రు అనిల్, తాతిన సత్యనారాయణ పాల్గొన్నారు.
రహదారిపై నిరసనలా ?
ద్వారకాతిరుమల, మే 8: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ద్వారకాతిరుమల ప్రధాన రహదారి పక్కనే టెంట్లు వేసి వైసీపీ నాయకులు నిరసన చేపట్టడం విమర్శలకు దారి తీసింది. నల్లజర్లలో తానేటి వనితపై మంగళవారం రాత్రి టీడీపీ వారు దాడి చేశారని దానికి నిరసనగా వైసీపీ నాయకులు నిత్యం రద్దీగా ఉండే గరుడాళ్వార్ సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఇందులో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కూడా పాల్గొనడంతో రహదారి వాహనాలు, జనా లతో రద్దీగా మారింది. రోడ్డుపై డివైడర్కు ఒక పక్క టెంట్లు వేసి కూర్చోగా మరోపక్క రాకపోకలకు అంత రాయం కల్గించేలా నేతల వాహనాలను నిలిపారు. దీంతో పలువురు ఇబ్బందులు పడ్డారు. దీనికి ఎన్నికల అధి కారుల నుంచి అనుమతి ఉందా ? రోడ్లపై ఈ నిరసనలు ఏమిటంటూ గ్రామస్థులు, భక్తులు మండిపడ్డారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికారులు అందు బాటులోకి రాలేదు.