Share News

Hyderabad: 11 గంటలు.. 102 సీసీ కెమెరాలు...

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:31 PM

‘నేను ఇల్లు వదిలి వెళ్తున్నా. నా కోసం వెతకకండి’ అంటూ ఓ బాలిక లేఖ రాసి వెళ్లిపోయింది. బ్యాచిలర్స్‌ నిద్రిస్తున్న సమయంలో గది కిటికీలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రెండు ఖరీదైన సెల్‌ఫోన్లు చోరీ చేసి పారిపోయారు. ఈ రెండు కేసుల్లో పోలీస్‌ కానిస్టేబుళ్లు తక్షణం స్పందించారు. రెండు బృందాలుగా విడిపోయి, సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ ఆ కేసులను 11 గంటల్లో ఛేదించారు.

Hyderabad: 11 గంటలు.. 102 సీసీ కెమెరాలు...

- బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు జల్లెడ పట్టిన కానిస్టేబుల్‌

- మరో కేసులో సెల్‌ఫోన్‌ దొంగల అరెస్ట్‌

హైదరాబాద్: ‘నేను ఇల్లు వదిలి వెళ్తున్నా. నా కోసం వెతకకండి’ అంటూ ఓ బాలిక లేఖ రాసి వెళ్లిపోయింది.

బ్యాచిలర్స్‌ నిద్రిస్తున్న సమయంలో గది కిటికీలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రెండు ఖరీదైన సెల్‌ఫోన్లు చోరీ చేసి పారిపోయారు. ఈ రెండు కేసుల్లో పోలీస్‌ కానిస్టేబుళ్లు తక్షణం స్పందించారు. రెండు బృందాలుగా విడిపోయి, సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ ఆ కేసులను 11 గంటల్లో ఛేదించారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణానగర్‌(Krishnanagar)కు చెందిన బాలిక (16) పదవ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు ఊరు వెళ్లడంతో సోదరుడితో కలిసి ఉంటోంది. ఈనెల పదో తేదీన ఉదయం ఇంట్లో పని విషయంలో సోదరుడు బాలికను మందలించాడు.

ఇదికూడా చదవండి: Trains: రైళ్లు ఖాళీలేవమ్మా..!!


అనంతరం అతను స్నానం చేసి వచ్చేలోపు బాలిక లేఖ రాసి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆమె ఆచూకీ కోసం సోదరుడు వెదికి చివరకు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు కృష్ణానగర్‌లో సీసీ కెమెరాలను పరిశీలించాడు. బాలిక యూసుఫ్‌ గూడ(Yusuf Guda) వైపు వెళ్లి అక్కడి నుంచి మెట్రోరైలు ఎక్కినట్టు గుర్తించారు. పోలీసులు నాగోల్‌ వెళ్లి అక్కడి కెమెరాలు పరిశీలించగా మెట్రో దిగినట్లు ఆనవాలు లభించలేదు.


city7.jpg

మెట్రోసిబ్బంది ద్వారా బాలిక సికింద్రాబాద్‌లో దిగినట్టు నిర్ధారించారు. వెంటనే బాలిక సోదరుడితో కలిసి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వెతకడం మొదలు పెట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి స్టేషన్‌లోని ఏసీ వెయిటింగ్‌ హాల్‌లో ఉన్నట్టు గుర్తించి పట్టుకున్నారు. దాదాపు 11 గంటల పాటు శ్రమించి, సుమారు 102 సీసీ కెమెరాలు పరిశీలించి బాలిక ఆచూకీ తెలుసుకొన్నారు. తల్లిదండ్రులకు అప్పగించి శభాష్‌ అనిపించుకున్నారు. వేగంగా స్పందించిన నాగేశ్వరరావును ఉన్నతాధికారులు అభినందించారు.


చోరుల కోసం..

వెంకటగిరికి చెందిన ముజాహర్‌ ఈనెల 10వ తేదీన ఉదయం గదిలోని కిటికీ వద్ద చార్జింగ్‌ పెట్టిన ఐఫోన్‌15 మాక్స్‌ ప్రో, వన్‌ప్లస్‌ ఫోన్లు కనిపించలేదు. వాకబు చేయడంతో గుర్తుతెలియని వ్యక్తులు చోరీచేసినట్టు తెలిసింది. వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. క్రైంకానిస్టేబుల్‌ శంకర్‌ రంగంలోకి దిగి, కృష్ణానగర్‌, యూసుఫ్ గూడ, ఎస్‌పీఆర్‌హిల్స్‌ వరకు సుమారు 34 కెమెరాలను పరిశీలించి, ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఎస్‌పీఆర్‌హిల్స్‌కు చెందిన డెలివరీబాయ్‌ అబ్దుల్‌నదీమ్‌, ఆటోడ్రైవర్‌ రఫీని అరెస్టుచేసి సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. శంకర్‌ పనితీరును ఉన్నతాధికారులు, బాధితులు అభినందించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 12 , 2024 | 12:31 PM