Share News

Viral News: బీచ్‌లో ఈతకొట్టాడు.. ఆ వెంటనే చనిపోయాడు.. కారణమిదే!

ABN , Publish Date - Jul 09 , 2024 | 08:05 PM

ఇప్పటికే ఎన్నో భయంకరమైన వైరస్‌లతో సహజీవనం చేస్తున్న మానవాళికి ఇప్పుడు మరో ముప్పు పొంచి వస్తోంది. మెదడుని తినే ఓ భయంకరమైన సూక్ష్మజీవి క్రమంగా వ్యాప్తి చెందుతోంది.

Viral News: బీచ్‌లో ఈతకొట్టాడు.. ఆ వెంటనే చనిపోయాడు.. కారణమిదే!
Brain-Eating Amoeba

ఇప్పటికే ఎన్నో భయంకరమైన వైరస్‌లతో సహజీవనం చేస్తున్న మానవాళికి ఇప్పుడు మరో ముప్పు పొంచి వస్తోంది. మెదడుని (Brain Eating Amoeba) తినే ఓ భయంకరమైన సూక్ష్మజీవి క్రమంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దీని వల్ల కొన్ని మరణాలు సంభవించగా.. తాజాగా ఇజ్రాయెల్‌లో (Israel) మరో వ్యక్తి మృతి చెందాడు. సరదా కోసం ఈతకొట్టడానికి వెళ్లి.. ఆ అమీబా బారిన పడి మృత్యువాత పడ్డాడు. అతడ్ని కాపాడటానికి వైద్యులు ఎన్నో చికిత్సలు చేశారు కానీ, చివరికి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


కొన్ని రోజుల క్రితం 25 ఏళ్ల ఓ కుర్రాడు ఇజ్రాయెల్‌లోని ప్రముఖ ‘గై’ బీచ్‌కు వెళ్లాడు. ఇది ఉత్తర ఇజ్రాయెల్‌లోని కిన్నెరెట్ ఒడ్డున ఉంటుంది. బీచ్‌లో దూకి.. కాసేపు ఈతకొట్టాడు. ఇంటికి తిరిగి వెళ్లేంతవరకూ అతని పరిస్థితి బాగానే ఉంది. కానీ.. సమయం గడిచేకొద్ది అతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. తీవ్రమైన జ్వరం బారిన పడ్డాడు. అంతేకాదు.. విపరీతమైన తలనొప్పి రావడంతో పాటు వాంతులు వచ్చాయి. ఇది చూసి భయపడిపోయిన అతని కుటుంబ సభ్యులు.. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరిశీలిస్తుండగా.. అతని పరిస్థితి మరింత దిగజారింది. దీంతో.. పెటా టిక్వాలో ఉండే బీలిన్సన్ ఆసుపత్రికి తరలించారు.


అక్కడి వైద్యులు ఆ యువకుడికి మెరుగైన చికిత్స అందించారు. అతని ప్రాణాలు కాపాడేందుకు.. శాయశక్తులా ప్రయత్నించారు. చివరికి ఐదు రోజుల పాటు ఆ అమీబాతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. తాము అన్ని రకాల ఔషధాలు అందించడంతో పాటు శస్త్రచికిత్సలు చేశామని.. అయినా అతనిని కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. కాగా.. ఇజ్రాయెల్‌లో ఇలాంటి మరణం నమోదు కావడం ఇది రెండోసారి. ఉత్తర ఇజ్రాయెల్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి.. ఆగస్టు 2022లో ఈ అమీబా బారిన పడి చనిపోయాడు. మన భారతదేశంలో కూడా ఈ అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో ముగ్గురు చనిపోయారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 08:05 PM