Share News

Helicopter Crash: కొండను ఢీ కొట్టిన హెలికాప్టర్.. చైనా టూరిస్టులు సహా అయిదుగురి దుర్మరణం

ABN , Publish Date - Aug 07 , 2024 | 05:04 PM

నేపాల్‌లో విషాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలిన(Helicopter Crash) ఘటనలో అందులో ఉన్న అయిదుగురూ మృతి చెందారు. ఇటీవలే ఓ విమానం కూలిన ఘటనలో 18 మంది మృతి చెందిన విషాదం మరువకముందే.. నువాకోట్‌ జిల్లాలోని శివపురిలో బుధవారం తాజా ప్రమాదం జరిగింది.

Helicopter Crash: కొండను ఢీ కొట్టిన హెలికాప్టర్.. చైనా టూరిస్టులు సహా అయిదుగురి దుర్మరణం

ఖాట్మండు: నేపాల్‌లో విషాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలిన(Helicopter Crash) ఘటనలో అందులో ఉన్న అయిదుగురూ మృతి చెందారు. ఇటీవలే ఓ విమానం కూలిన ఘటనలో 18 మంది మృతి చెందిన విషాదం మరువకముందే.. నువాకోట్‌ జిల్లాలోని శివపురిలో బుధవారం తాజా ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ రాజధాని ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద కొండను ఢీకొట్టింది. ఆ ధాటికి హెలికాప్టర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

కూలుతున్న సమయంలో అందులో మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 1.50 ప్రాంతంలో హెలికాప్టర్ ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. అయితే సూర్య చౌర్ -7 కొండ వద్దకు చేరుకున్న తర్వాత గ్రౌండ్ కంట్రోల్‌తో హెలికాప్టర్ సంబంధాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు.


త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి పైకి ఎగిరిన 3 నిమిషాలకే దానితో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు గుర్తించారు. సాంకేతిక సమస్యతోనే హెలికాప్టర్ సిగ్నలింగ్ సరిగ్గా పని చేయలేదని.. దీంతో అది అదుపుతప్పి కొండను ఢీకొట్టి ముక్కలైందని చెప్పారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే భద్రతాదళ అధికారులు రంగంలోకి దిగారు.

మృతదేహాలను అందులోంచి బయటకి తీశారు. ఘటన సమయంలో అందులో పైలట్‌తోపాటు నలుగురు చైనా పర్యాటకులు ఉన్నట్లు గుర్తించారు. వారందరూ మరణించినట్లు నిర్ధారించారు. అరుణ్ మల్లా అనే పైలెట్ దాన్ని నడపినట్లు పోలీసులు చెప్పారు. శివపురి రూరల్ మున్సిపాలిటీ, నువాకోట్‌లోని వార్డు నంబర్ 7లో ఐదు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు.


తరచూ ప్రమాదాలు..

నేపాల్‌లో తరచూ విమానాలు కుప్పకూలుతుండటంపై అక్కడి పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కఠినమైన పర్వత భూభాగం, నిరంతరం మారే వాతావరణం ఉంటుంది. దీంతోపాటు నేపాల్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రిమోట్ రన్‌వేలు ఉన్నాయి. వీటిపై ల్యాండ్ కావడం అనుభవజ్ఞులైన పైలట్‌లకు కూడా సవాలుగా మారింది. 2023 జనవరిలో పోఖారాలో ఏటి ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలి 72 మంది ప్రయాణికులు చనిపోయారు.

ఆ ఏడాదే అక్కడి రన్‌వే లోపాలపై వార్తలు వచ్చాయి. దీనికితోడు పర్వతాలు ఉన్న ప్రాంతం కావడంతో అక్కడి వాతావరణంలో తరచూ హెచ్చుతగ్గులు వస్తాయి.1992లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ ఖాట్మండుకు చేరుకునేముందు.. కొండపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో167 మంది చనిపోయారు. ఇది నేపాల్ విమాన ప్రమాదాల చరిత్రలో అత్యంత విషాద ఘటనగా నిలిచింది.

Updated Date - Aug 07 , 2024 | 05:04 PM