Share News

Central Govt : జమిలిఈ టర్మ్‌లోనే!

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:01 AM

లోక్‌సభలో బీజేపీకి సొంతగా సంపూర్ణ మెజారిటీ లేనప్పటికీ జమిలి ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉంది. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’కు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తుందని మోదీ సర్కారు ఆశాభావంతో ఉంది.

Central Govt : జమిలిఈ టర్మ్‌లోనే!

  • ఒక దేశం-ఒకే ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కారు ఆశాభావం

  • ఎన్డీయే పక్షాల మధ్య సమన్వయం భేష్‌

  • ఈ బంధం ఐదేళ్లూ కొనసాగుతుంది!

  • త్వరలోనే జనాభా లెక్కల సేకరణ

  • కులగణనపై ఇంకా నిర్ణయించలేదు

  • కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: లోక్‌సభలో బీజేపీకి సొంతగా సంపూర్ణ మెజారిటీ లేనప్పటికీ జమిలి ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉంది. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’కు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తుందని మోదీ సర్కారు ఆశాభావంతో ఉంది. మోదీ సారథ్యంలోని ప్రభుత్వం మూడోసారి అధికార పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తవుతోందని.. పాలక కూటమిలో సమన్వయం అద్భుతంగా ఉందని.. ఈ బంధం ఐదేళ్లూ పటిష్ఠంగా కొనసాగుతుందని గట్టిగా భావిస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. ‘జమిలి ఎన్నికలు ఈ టర్మ్‌లోనే అమలవుతాయి. వాస్తవ రూపం దాల్చబోతోంది’ అని వెల్లడించాయు. లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల హామీ కూడా ఉంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సమాంతరంగా ఒకేసారి ఎన్నికలు జరపాలని.. ఇవి పూర్తయిన వంద రోజుల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఇప్పటికే సిఫారసు చేసింది. జాతీయ లా కమిషన్‌ కూడా 2029 నుంచి లోక్‌సభ, అసెంబ్లీలు, పంచాయతీలు/మున్సిపాలిటీలకు ఒకే దఫా ఎన్నికలు జరపాలని.. ఒకవేళ త్రిశంకు సభ ఏర్పడితే లేదా అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాలు ఓడిపోతే ఐక్య ప్రభుత్వాలు ఏర్పాటుచేయాలన్న నిబంధనతో విడిగా ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తన సిఫారసుల అమలుకు ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలని కోవింద్‌ కమిటీ ప్రతిపాదించింది. అలాగే జమిలి ఎన్నికలకు 18 రాజ్యాంగ సవరణలను సూచించింది. వీటిలో ఎక్కువ సవరణలకు రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అక్కర్లేదని వివరించింది.


  • ‘కులం’ కాలమ్‌ ఉంటుందా?

జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే కులాలవారీగా జనగణన చేపట్టడంపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సదరు డాక్యుమెంటుపై ‘కులం’ కాలమ్‌ పెట్టాలా.. అక్కర్లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకోవలసి ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు, కొన్ని ఎన్డీయే పార్టీలు కూడా కులగణన చేపట్టాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి. జనాభా లెక్కలు వెల్లడైన తర్వాత చట్టసభల నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగుతుంది. ఇది పూర్తికాగానే లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు సీట్ల కేటాయింపు అమల్లోకి వస్తుంది. కాగా, ప్రభుత్వ ఎన్యుమరేటర్ల ద్వారా కాకుండా తమంత తాము జనగణన దరఖాస్తును నింపాలనుకునే పౌరులు ఎన్‌పీఆర్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా, రెండేళ్లలో దేశంలో నక్సలిజం పూర్తిగా కనుమరుగవుతుందని కేంద్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటి 100 రోజుల కార్యాచరణ జాబితాలోనే నక్సల్స్‌ సమస్యపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాల ఆపరేషన్లలో 150 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు.

Updated Date - Sep 16 , 2024 | 03:01 AM