Share News

Doda encounter: నలుగురు జవాన్లు వీరమరణం.. రంగంలోకి రక్షణ మంత్రి

ABN , Publish Date - Jul 16 , 2024 | 11:34 AM

జమ్మూ-కాశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత ఆర్మీ సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.

Doda encounter: నలుగురు జవాన్లు వీరమరణం.. రంగంలోకి రక్షణ మంత్రి

దోడా: జమ్మూ-కాశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత ఆర్మీ సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేదీతో మాట్లాడారు. నలుగురు సైనికులు అమరులు అయిన నేపథ్యంలో ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తున్నట్టు ఆర్మీ చీఫ్‌కు రక్షణమంత్రి చెప్పారు. ఇక ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దోడాలో పరిస్థితులు, కొనసాగుతున్న ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు.


కాగా జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున సాయుధ ఉగ్రవాదులతో భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక పోలీసు బలగాలు సంయుక్తంగా ఎన్‌కౌంటర్ ఆపరేషన్ చేశారు. అయితే ఈ ఆపరేషన్‌లో ఒక అధికారితో సహా నలుగురు సైనికులు అసువులు బాశారు. పలువురికి గాయాలు అయినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. రాత్రి 9 గంటల సమయంలో ఎన్‌కౌంటర్ మొదలైంది. అయితే ఉగ్రవాదులు దొంగదెబ్బ తీయడంతో నలుగురు జవాన్లు కోల్పోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.


జమ్మూ ప్రాంతంలో ఇటీవల జరిగి రెండో అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు చెబుతున్నారు. గతవారం కథువాలో ఐదుగురు సైనికులు మరణించారని, ఆ తర్వాత ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని చెప్పారు. కాగా జమ్మూ ప్రాంతంలో తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో ఆర్మీని కోరారు. దీంతో బలగాలు రంగంలోకి దిగి జల్లెడ పడుతూ ఉగ్రమూకలను ఏరివేస్తు్న్నాయి.

Updated Date - Jul 16 , 2024 | 11:38 AM