Share News

EC : సార్వత్రిక పోరు..అభ్యర్థుల తీరు.. మొత్తం 8,360 మంది బరిలో

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:30 AM

ఇంకొన్ని గంటల్లో ఈవీఎంల్లో దాగిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా సంపద సర్వే, ఆస్తుల పునఃపంపిణీ చుట్టూనే వాదం, వివాదం, సవాళ్ల పర్వం సాగింది.

EC : సార్వత్రిక పోరు..అభ్యర్థుల తీరు.. మొత్తం 8,360 మంది బరిలో

2,572 మందికి కోటికిపైగా ఆస్తులు

1,643 మందిపై నేరాభియోగాలు

న్యూఢిల్లీ, జూన్‌ 3 : ఇంకొన్ని గంటల్లో ఈవీఎంల్లో దాగిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా సంపద సర్వే, ఆస్తుల పునఃపంపిణీ చుట్టూనే వాదం, వివాదం, సవాళ్ల పర్వం సాగింది. ఈ నేపథ్యంలో 18వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల ఆర్థిక బలం గురించిన వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 8,360 మంది పోటీ చేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ స్థాయి పోటీ ఇదే మొదటిసారి. ఆ ఎన్నికల్లో 13,952 మంది అభ్యర్థులు తలపడ్డారు. మొత్తం అభ్యర్థుల్లో 2,572మందికి (31 శాతం) రూ. కోటికిపైగా ఆస్తులు ఉన్నాయి. వీరిలో ఒక్కొక్కరికి సగటున 6.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో 1,643 మందిపై (20శాతం) క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 2019తో పోల్చితే ఒక శాతం, 2014తో పోల్చితే మూడు శాతం, 2014తో పోల్చితే ఇది ఐదు శాతం ఎక్కువ. ఇందులో 1,191 (14శాతం) మందిపై అత్యాచారం, హత్యలు, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి. అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన నామినేషన్లలోని వివరాల ఆధారంగా స్వతంత్ర సంస్థలైన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), పీఆర్‌ఎస్‌ లెజిస్లేవిట్‌ రిసెర్చ్‌... ఈ వివరాలను అందించాయి. ఆ వివరాలను అనుసరించి.. ఆరు జాతీయ పార్టీలు సహా చిన్న, పెద్ద పార్టీలను కలుపుకొంటే 744 రాజకీయ పార్టీలు 543 స్థానాలకు తమ అభ్యర్థులు నిలిపాయి.

అందులో 16 శాతం జాతీయ పార్టీల నుంచే ఉన్నారు. ఇందులో బీఎస్పీ అత్యధికంగా 488 మందిని నిలిపింది. ఇక బీజేపీ 441 మందిని, కాంగ్రెస్‌ 328 మందిని, సీపీఎం 52 మందిని, ఆప్‌ 22 మందిని, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ముగ్గురిని బరిలో నిలిపాయి. ఇక ఆరుశాతం ప్రాంతీయ పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా ఎస్పీ 71 మందిని పోటీకి నిలపగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ 48, ఏఐఏడీఎమ్‌కే 36, సీపీఐ 30, వైసీపీ 25, ఆర్‌జేడీ 24, డీఎంకే 22 మంది, టీడీపీ 17 మందిని నిలిపాయి. గుర్తింపు పొందని పార్టీల్లో అత్యధికంగా సోషల్‌ యునిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్టు) అత్యధికంగా 150 మందిని, పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (డెమోక్రటిక్‌) 79 మందిని నిలిపాయి. లోక్‌సభ నియోజకవర్గానికి సగటున 15 మంది ఈసారి బరిలో ఉన్నారు. తెలంగాణలో మాత్రం సగటున 31 మంది నిలవగా, అత్యల్పంగా లఢక్‌, నాగాలాండ్‌ల్లో సగటున ముగ్గురు పోటీచేస్తున్నారు.

Updated Date - Jun 04 , 2024 | 04:30 AM