Share News

Nagpur: కోడలు కర్కశం.. రూ.300 కోట్ల ఆస్తి కోసం మామను దారుణంగా...

ABN , Publish Date - Jun 12 , 2024 | 08:01 PM

ఆస్తుల కోసం సొంత వాళ్లన్ని బలితీసుకుంటున్న రోజులివి. మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనే వాక్యానికి సరితూగే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి బయటకి వచ్చింది. ఆస్తి కోసం ఓ కోడలు కిరాతకంగా వ్యవహరించింది.

Nagpur: కోడలు కర్కశం.. రూ.300 కోట్ల ఆస్తి కోసం మామను దారుణంగా...

నాగ్‌పుర్: ఆస్తుల కోసం సొంత వాళ్లన్ని బలితీసుకుంటున్న రోజులివి. మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనే వాక్యానికి సరితూగే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి బయటకి వచ్చింది. ఆస్తి కోసం ఓ కోడలు కిరాతకంగా వ్యవహరించింది. సొంత మామను కారుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. తనపై అనుమానం రాకుండా సీన్‌ అల్లింది. కట్ చేస్తే.. పోలీసులు దర్యాప్తులో అడ్డంగా దొరికిపోయింది. మామను హత్య చేయడానికి రూ.కోటి సుపారీ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పురుషోత్తం పుట్టేవార్(82) గతవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తన భార్య శకుంతలను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు ఆయనను ఢీకొట్టింది. హిట్ అండ్ రన్‌గా భావించిన పోలీసులు కేసు నమోదుచేశారు.


అయితే అనుమానం వచ్చి కేసును లోతుగా దర్యాప్తు చేయగా విస్తుగొల్పే విషయాలు బయటకి వచ్చాయి. పురుషోత్తాన్ని ఆస్తి కోసం ఆయన కోడలు అర్చనా మనీశ హత్య చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. గడ్చిరోలిలో టౌన్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న అర్చన, తన భర్త మనీశ్ కారు నడిపే డ్రైవర్ సహకారంతో మామను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.

ఎవరికీ అనుమానం రాకుండా కారుతో ఢీకొట్టి చంపించి, ప్రమాదంగా చిత్రీకరించిందని వెల్లడించారు. మామ చనిపోతే ఆయన పేరు మీదున్న రూ.300 కోట్లకుపైగా ఆస్తి తన సొంతమవుతుందనే ఆశతో కర్కశానికి పాల్పడిందని దర్యాప్తులో తేలింది. అర్చన, కారు డ్రైవర్ బగ్డేతో పాటు నీరజ్, సచిన్ ధార్మిక్ అనే మరో ఇద్దరు ఈ హత్యలో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. వారి నుంచి కార్లు, బంగారు ఆభరణాలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.


అర్చనపై అవినీతి ఆరోపణలు..

కోడలు అర్చనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని విచారణలో వెల్లడైంది. ఆమె అవినీతిపై అనేక మంది ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. నిబంధనలు ఉల్లంఘించి లేఅవుట్‌లకు పర్మిషన్లు ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 08:01 PM