Share News

IIT: చరిత్ర సృష్టించిన ఐఐటీ మద్రాస్.. ఏకంగా రూ.513 కోట్ల విరాళాలు

ABN , Publish Date - May 09 , 2024 | 09:05 AM

విరాళాల(Funds) సేకరణలో ఐఐటీ మద్రాస్ చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు విరాళాలుగా సమకూరినట్లు ఐఐటీ మద్రాస్(IIT Madras) సంచాలకుడు ప్రొఫెసర్ కామకోటి బుధవారం ప్రకటించారు.

IIT: చరిత్ర సృష్టించిన ఐఐటీ మద్రాస్.. ఏకంగా రూ.513 కోట్ల విరాళాలు

చెన్నై: విరాళాల(Funds) సేకరణలో ఐఐటీ మద్రాస్ చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు విరాళాలుగా సమకూరినట్లు ఐఐటీ మద్రాస్(IIT Madras) సంచాలకుడు ప్రొఫెసర్ కామకోటి బుధవారం ప్రకటించారు. ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి ఇంత ఎక్కువ మొత్తం నిధులు సమకూరడం ఇదే తొలిసారి. వీటితోపాటు అదనంగా ఇంకో రూ.717 కోట్ల నిధులు ఇచ్చేందుకు కార్పొరేట్‌ సంస్థలు, పూర్వ విద్యార్థులు ముందుకొచ్చినట్లు కామకోటి చెప్పారు. ఈ నిధుల్ని రిసర్చ్, విద్యాసంస్థ అభివృద్ధికి, విద్యార్థుల ఉపకారవేతనాలకు ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. గడిచిన నాలుగేళ్లలో రూ.976.2 కోట్ల నిధులు ఐఐటీకి సమకూరాయన్నారు. విరాళాలు ఇచ్చిన వారిలో 60 వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు.


పూర్వ విద్యార్థుల నుంచి రూ.368 కోట్లు, కార్పొరేట్ సంస్థల నుంచి రూ.95 కోట్లు, ఇతర దాతల నుంచి రూ.50 కోట్లు గడిచిన ఆర్థిక సంవత్సరంలో అందాయి. 960 మంది పూర్వ విద్యార్థులు, 112 కార్పొరేట్ సంస్థలతో సహా 1,072 మంది దాతలు విరాళాలు ఇచ్చారు. ఫండ్ మేనేజ్‌మెంట్‌లో పారదర్శకత ఉండటంతో పూర్వ విద్యార్థుల సంఘం సంస్థపై నమ్మకం ఉంచి నిధులను విరాళంగా ఇచ్చిందని ఐఐటీ-మద్రాస్ అలుమ్ని ఛారిటబుల్ ట్రస్ట్ (IITMCT) చైర్‌పర్సన్ వి శంకర్ తెలిపారు.

2020-21 నుండి ఐఐటీ మద్రాస్‌కి వచ్చే నిధులు అనేక రెట్లు పెరిగాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 14.87 కోట్లను ఆకర్షించింది. 2021-22, 2022-23 కాలంలో రూ.131 కోట్లు, రూ.231 కోట్లకు ఎగబాకింది.

Read Latest News and National News click here..

Updated Date - May 09 , 2024 | 09:12 AM