Share News

Delhi : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:36 AM

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు, ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతిస్థాపనకు భారత్‌, బంగ్లాదేశ్‌ పరస్పరం అంగీకరించాయి. ఆయుధాల ఉత్పత్తి, రక్షణ సహకారం, బంగ్లాదేశ్‌ సాయుధ బలగాల ఆధునీకరణకు బంగ్లాకు సహకరించేందుకు...

Delhi : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

తీస్తా నదీ జలాల నిర్వహణ, సంరక్షణలో భారత్‌ సహకారం

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య పది కీలక ఒప్పందాలు

న్యూఢిల్లీ, జూన్‌ 22: ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు, ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతిస్థాపనకు భారత్‌, బంగ్లాదేశ్‌ పరస్పరం అంగీకరించాయి. ఆయుధాల ఉత్పత్తి, రక్షణ సహకారం, బంగ్లాదేశ్‌ సాయుధ బలగాల ఆధునీకరణకు బంగ్లాకు సహకరించేందుకు, తీస్తా నదీ జలాల సంరక్షణ, నిర్వహణకు భారత్‌ ముందుకొచ్చింది.

ఇది కాక, సముద్రయానం, అంతరిక్షం, రైల్వే, గ్రీన్‌ టెక్నాలజీ, బ్లూ ఎకానమీ తదితర రంగాల్లో ఇరుదేశాల మధ్య పది కీలక ఒప్పందాలు జరిగాయి. రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో శనివారం సుదీర్ఘ చర్చలు జరిపిన ప్రధాని మోదీ ఈ ఒప్పందాలు చేసుకున్నారు.

కొత్త లోక్‌సభ కొలువుదీరిన తర్వాత భారత్‌కు వచ్చిన తొలి విదేశీ నేత షేక్‌ హసీనానే. ఈ చర్చల అనంతరం ఇరువురు నేతలు కలిసి విలేకరులతో మాట్లాడారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలకు న్యూఢిల్లీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైద్యం కోసం భారత్‌కు వచ్చే బంగ్లాదేశీయుల కోసం త్వరలో ఈ-వీసాలు జారీ చేస్తామని ప్రకటించారు. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పుర్‌లో త్వరలో భారత అసిస్టెంట్‌ హైకమిషన్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘ఇండియన్‌ ఓషన్‌ రీజియన్‌’లో చేరేందుకు బంగ్లాదేశ్‌ ముందుకు రావడాన్ని మోదీ స్వాగతించారు.

ఇక, షేక్‌ హసీనా మాట్లాడుతూ భారతదేశం తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని పేర్కొన్నారు.


చైనా కన్నేసిన ‘తీస్తా’ భారత్‌ చేతికి

తీస్తా నది ప్రాజెక్టుపై చైనా చాలా ఆసక్తి చూపెట్టిన నేపథ్యంలో భారత్‌-బంగ్లా మధ్య తీస్తా జలాల నిర్వహణపై ఒప్పందం జరగడం గమనార్హం. ఈ ప్రాజెక్టులో భాగంగా తీస్తా నది జలాల సంరక్షణ, నిర్వహణకు భారీ రిజర్వాయర్ల నిర్మాణం, సంబంధిత నిర్మాణాలు చేపట్టనున్నారు. కాగా, మోదీతో సమావేశానికి ముందు షేక్‌ హసీనా శనివారం ఉదయం రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలిశారు.

Updated Date - Jun 23 , 2024 | 03:36 AM