Share News

నేపాల్‌లో బస్సు నదిలోకి దూసుకెళ్లి.. 27 మంది భారతీయుల మృతి

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:35 AM

నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పర్యటకులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్‌ బస్సు నదిలోకి దూసుకెళ్లడంతో 27 మంది భారతీయులు మరణించారు.

నేపాల్‌లో బస్సు నదిలోకి దూసుకెళ్లి.. 27 మంది భారతీయుల మృతి

  • 16 మందికి గాయాలు.. మృతులందరూ మహారాష్ట్ర వాసులే

  • కాఠ్మాండూలోని తనహున్‌ జిల్లాలో ఘటన

కాఠ్మాండూ, ఆగస్టు 23: నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పర్యటకులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్‌ బస్సు నదిలోకి దూసుకెళ్లడంతో 27 మంది భారతీయులు మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్రకు చెందిన వారుగా తెలుస్తోంది.

మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లాకు చెందిన 104 మంది భక్తులు విహారయాత్ర కోసం పది రోజుల క్రితం మూడు బస్సుల్లో నేపాల్‌ వెళ్లారు. శుక్రవారం ఉదయం నేపాల్‌లోని పొఖారా నుంచి కాఠ్మాండూకు బయలుదేరారు.

తనహున్‌ జిల్లా సమీపంలోని ఐరాపహార్‌ ప్రాంతంలో ప్రయాణికుల బస్సు అదుపుతప్పి 150 మీటర్ల మర్స్యండ్గి నదిలో పడింది. ఆ సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ‘‘ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నంబరు ప్లేట్‌తో ఉన్న ఓ ట్రావెల్స్‌ బస్సు కాఠ్మాండూలోని తనహున్‌ జిల్లా సమీపంలో నదిలో పడింది.

కొండప్రాంతంలో అదుపుతప్పి 150 మీటర్ల లోతులోగల మర్స్యండ్గి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 16 మందిని రక్షించాం.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం’’ అని నేపాల్‌ అధికారులు తెలిపారు. కాగా, గత నెలలో కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మరణించారు.

Updated Date - Aug 24 , 2024 | 06:14 AM