Share News

ప్రముఖ న్యాయ కోవిదుడు నూరానీ కన్నుమూత

ABN , Publish Date - Aug 30 , 2024 | 03:38 AM

ప్రముఖ న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, రచయిత, మేధావిగా గుర్తింపు పొందిన ఎ.జి.నూరానీ గురువారం ముంబైలో కన్ను మూశారు.

ప్రముఖ న్యాయ కోవిదుడు నూరానీ కన్నుమూత

  • రాజ్యాంగ నిపుణుడు, రచయితగా గుర్తింపు

ముంబై, ఆగస్టు 29: ప్రముఖ న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, రచయిత, మేధావిగా గుర్తింపు పొందిన ఎ.జి.నూరానీ గురువారం ముంబైలో కన్ను మూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. ఆయన పూర్తి పేరు అబ్దుల్‌ గఫూర్‌ మజీద్‌ నూరానీ. 1930 సెప్టెంబరు 16న ముంబయిలో జన్మించారు. ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో విద్యనభ్యసించిన ఆయన సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టుల్లో ప్రతిభావంతుడైన న్యాయవాదిగా పేరు గడించారు.

పలు జాతీయ, ప్రాంతీయ పత్రికలకు నిత్యం వ్యాసాలు రాస్తూ కాలమిస్టుగా గుర్తింపు పొందారు. ‘హైదరాబాబాద్‌ విధ్వంసం’ (డిస్ట్రక్షన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌), కశ్మీర్‌ డిస్ప్యూట్‌-1947-2012, ఆర్టికల్‌ 370 వంటి పుస్తకాలు రాశారు. మాజీ రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌, బ్రిటిష్‌ పాలనలో బాంబే హైకోర్టులో మొట్టమొదటి భారతీయ బారిస్టర్‌గా పనిచేసిన బద్రుద్దీన్‌ త్యాబ్జీల జీవిత చరిత్రలు రాశారు. షేక్‌ అబ్దుల్లా, కరుణానిధిల తరఫున కేసులు వాదించారు. రాజ్యాంగ అంశా లు, ముస్లింల సమస్యలపై పలు ఉపన్యాసాలు ఇ వ్వడంతో పాటు సదస్సుల్లో పత్రాలు సమర్పించారు. ఆయన మృతి పట్ల జమ్మూ-కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సంతాపం తెలిపారు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ సంతాపం తెలుపుతూ రాజ్యాం గం, కశ్మీర్‌, చైనా వంటి అంశాలతో పాటు.. మంచి ఆహారాన్ని ఆస్వాదించడంపైనా పుస్తకాలు రాశారని తెలిపారు. మేధావుల్లో ఉన్నతుడని ప్రస్తుతించారు.

Updated Date - Aug 30 , 2024 | 03:38 AM