Share News

Akhilesh Yadav: లోక్‌సభ స్పీకర్ అధికారాలపై అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణ.. కౌంటర్ ఇచ్చిన అమిత్ షా

ABN , Publish Date - Aug 08 , 2024 | 04:03 PM

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అభిలేష్ యాదవ్ పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హక్కులను కాలరాస్తున్నారని, ఆయన కోసం ప్రతిపక్షాలు పోరాడాల్సి వస్తోందని ఆరోపించారు.

Akhilesh Yadav: లోక్‌సభ స్పీకర్ అధికారాలపై అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణ.. కౌంటర్ ఇచ్చిన అమిత్ షా
Akhilesh Yadav Amit Shah

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అభిలేష్ యాదవ్ పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హక్కులను కాలరాస్తున్నారని, ఆయన కోసం ప్రతిపక్షాలు పోరాడాల్సి వస్తోందని ఆరోపించారు. వక్ఫ్ (సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ హక్కులు, మా హక్కులను హరించివేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మీరే (స్పీకర్) న్యాయమూర్తి. కానీ మీ హక్కులు హరించివేస్తున్నారని నేను విన్నాను. మీ కోసం మేము పోరాడాలి’’ అని అన్నారు.


అఖిలేశ్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌంటర్లు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు స్పీకర్‌ను అవమానించడమేనని, స్పీకర్ హక్కులు ప్రతిపక్షానికి చెందినవి కావని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్ హక్కులు సభ మొత్తానికి చెందుతాయని, ఈ విధంగా మాట్లాడడం సరికాదని అన్నారు. స్పీకర్ హక్కుల పరిరక్షించేది తమరు కాదని అమిత్ షా సెటైర్లు వేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా కూడా స్పందించారు. తనపైనా, సభలోని ఇతర సభ్యులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, తాను ఇదే కోరుకుంటున్నానని అన్నారు. స్పీకర్‌ స్థానంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదని వ్యాఖ్యానించారు.


సభలో వక్ఫ్ బిల్లు..

ఇండియా కూటమి పక్షాల నిరసన మధ్య కేంద్రప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో మైనార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజం మెచ్చుకునేదిగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు చట్టంలో ఉన్న లొసుగులను సరిచేయడం కోసమే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సరిగ్గా రూపొందించలేదన్నారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఏ అధికరణకు వ్యతిరేకంగా లేదన్నారు. రాజకీయ కారణాలతో బిల్లు తీసుకొచ్చారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కిరణ్ రిజిజు సభలో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయం అందిరకీ ఒకేలా ఉండాలన్నారు. మతాలవారీ న్యాయం ఉండదన్నారు.


ఈ బిల్లు ద్వారా ఎవరి హక్కులను హరించడంలేదని, ముస్లిం సమాజంలో అందరికీ హక్కులు కల్పించే ఉద్దేశంతో ఈ సవరణ బిల్లు తీసుకొస్తున్నామన్నారు. బిల్లుపై సంప్రదింపులు చేయకుండా.. ఏకపక్షంగా తీసుకొచ్చారని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 2014 తర్వాత వక్ఫ్ బోర్డు చట్టంపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించామని, ఎంతోమంది ప్రజలతో మాట్లాడి.. వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. అనేకమంది ముస్లిం పెద్దలు, ముస్లిం సంస్థలను కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుని దానికి అనుగుణంగా బిల్లు తీసుకొచ్చినట్లు కిరణ్ రిజిజు చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా ప్రజల అభిప్రాయాలు స్వీకరించామన్నారు. ఎవరిని సంప్రదించకుండా బిల్లు తీసుకొచ్చామనడం సరికాదన్నారు.

Updated Date - Aug 08 , 2024 | 04:04 PM