Share News

Volunteer System: అసెంబ్లీ వేదికగా వలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:27 PM

వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థపై (Volunteer System) కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుందా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది...

Volunteer System: అసెంబ్లీ వేదికగా వలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా కీలక ప్రకటన

అమరావతి : వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థపై (Volunteer System) కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుందా..? లేదా..? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఓ వైపు ఈ వ్యవస్థ ఉంటుందో.. లేదో అని వలంటీర్లు ఆందోళన చెందుతుంటే, మరోవైపు ఈ వ్యవస్థను కొనసాగించి తీరాలనే డిమాండ్ ప్రజా సంఘాలు, ప్రజలు, ఆఖరికి వైసీపీ నుంచి కూడా గట్టిగానే పట్టుబడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలా నెలకొన్న ఎన్నో ప్రశ్నలకు, ఇన్నాళ్లు నెలకొన్న సందిగ్ధతకు కూటమి ప్రభుత్వం తెరదించింది. అసెంబ్లీ వేదికగా వలంటీర్ వ్యవస్థపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి (Dola Sree Bala Veeranjaneya Swamy) స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.


Dola-Bala-Veeranjayaneyulu.jpg

త్వరలోనే శుభవార్త!

శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శాసన మండలిలో మాట్లాడిన మంత్రి డోలా.. ఏపీలో వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని తేల్చి చెప్పేశారు. అలాగే.. గౌరవ వేతనంపై కూడా ప్రతిపాదనలు వస్తున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే పూర్తి స్థాయిలో విధివిధానాల రూపకల్పన చేస్తామని డోలా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. వాస్తవానికి వలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియా వేదికగా, మీడియా ముందుకు వచ్చి మంత్రి సమాధానం ఇస్తూనే వస్తున్నారు. అయినప్పటికీ ఇవాళ శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ డోలా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో 2 లక్షల మంది వలంటీర్లలో నెలకొన్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది. మంత్రి మాటలు చూస్తుంటే.. త్వరలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వలంటీర్లకు శుభవార్త వస్తుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో.. వలంటీర్లు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చన్న మాట.


Chandrababu.jpg

తొలగించే ప్రసక్తే లేదు..!

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ వ్యవస్థపై ఒకరిద్దరు నేతలు ఏదేదో మాట్లాడేసే సరికి.. అసలు ఏం జరుగుతోంది..? ఈ వ్యవస్థ ఉంటుందా..? లేదా..? పూర్తిగా తొలగించేస్తారా..? అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిన పరిస్థితి. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ వలంటీర్ వ్యవస్థను తొలగించే ప్రసక్తే లేదని చెప్పిన విషయాన్ని వలంటీర్లు, సామాన్య ప్రజలు సైతం పదే పదే గుర్తు చేశారు. అంతేకాదు.. ఉగాది పర్వదినాన స్వయంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వలంటీర్లకు గౌరవ వేతనంగా 10 వేల రూపాయిలు ఇస్తామన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంపై సంబంధిత మంత్రి స్పందిస్తూ ఇప్పటి వరకూ ఈ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. కేబినెట్‌లో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని అప్పట్లో మంత్రి డోలా చెప్పారు కూడా. ఇప్పడిక అసెంబ్లీ వేదికగానే మంత్రి క్లారిటీ ఇవ్వడంతో వలంటీర్లు ఊపిరిపీల్చుకున్నట్లు అయ్యింది.

Volunteer-Systerm.jpg

Updated Date - Jul 26 , 2024 | 03:31 PM