Share News

నిమిషమైనా ఆగకుండా..

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:25 PM

వర్షాకాలంలో మెట్రో రైలు రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

నిమిషమైనా ఆగకుండా..

  • మెట్రో రాకపోకలపై మరింత అలర్ట్‌

  • వానాకాలం నేపథ్యంలో భద్రతా చర్యలు

  • నిరంతర విద్యుత్‌ సరఫరాకు పటిష్ట వ్యూహం

  • ఒకచోట నిలిస్తే.. మరోచోట నుంచి సరఫరా

  • 24 గంటలూ పర్యవేక్షించాలని అధికారుల ఆదేశాలు

  • ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న మెట్రో రైళ్లు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో మెట్రో రైలు రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు మెట్రో, ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల ఎంజీబీఎస్‌ సబ్‌స్టేషన్‌లోని ఇన్‌కమింగ్‌ ట్రాన్స్‌కో ఫీడర్‌లో ఏర్పడిన ట్రిప్పింగ్‌ సమస్య కారణంగా ఎర్రమంజిల్‌ స్టేషన్‌ వద్ద మెట్రో రైలు తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథఽ్యంలో మరోసారి విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు ఏర్పడకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు మొదలవుతున్న రైళ్లు రాత్రి 11.15 గంటల వరకు, ప్రతీ శుక్రవారం రాత్రి 12.45 గంటల వరకు నడుస్తున్న తరుణంలో నిమిషం కూడా విద్యుత్‌ సరఫరాలో ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో ముందుకుసాగుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యే అవకాశముంటుందని.. అందుకే నిమిషం కూడా ఇబ్బంది రాకుండా విద్యుత్‌ సరఫరాను 24 గంటలపాటు పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశిస్తున్నారు.

విద్యుత్‌ సరఫరా ఇలా..

ఎల్‌బీ నగర్‌ - మియాపూర్‌, జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌, నాగోలు - రాయదుర్గం కారిడార్లలోని 57 స్టేషన్ల పరిధిలో రోజుకు 1,028 మెట్రో రైలు ట్రిప్పులను నడిపిస్తున్నారు. అయితే ఎలివేటెడ్‌ కారిడార్‌లో నడుస్తున్న ఈ రైళ్లకు కావాల్సిన 132 కేవీ లైన్‌తో విద్యుత్‌ సరఫరాను తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి తీసుకుంటున్నారు. ఈ మేరకు ఉప్పల్‌, మియాపూర్‌, యూసు్‌ఫగూడ, ఎంజీబీఎ్‌సలో ఏర్పాటు చేసిన రిసివింగ్‌ సబ్‌స్టేషన్లు (ఆర్‌ఎ్‌సఎస్‌) ద్వారా తీసుకుని రైళ్ల ఆపరేషన్స్‌, మెయింటనెన్స్‌ పనులు చేపడుతున్నారు. కాగా, 132 కేవీ సామర్థ్యం కలిగిన లైన్‌ ద్వారా ఇస్తున్న కరెంట్‌లో 33 కేవీని లైటింగ్‌, సాధారణ నిర్వహణ పనులకు, సింగిల్‌ ఫేజ్‌ ద్వారా ఇస్తున్న 25 కేవీ లైన్‌ విద్యుత్‌ను ట్రాక్షన్‌ నిర్వహణకు వాడుకుంటున్నారు. అయితే ఈ విద్యుత్‌ సరఫరాను ఉప్పల్‌ డిపోలోని ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల తలెత్తిన అంతరాయాన్ని కూడా ఇక్కడి నుంచే తెలుసుకుని సత్వర చర్యలు చేపట్టారు.

ఒక చోట నుంచి నిలిస్తే.. మరో చోట నుంచి..

మెట్రో రైలు పరుగెత్తడానికి ప్రధానమైనది విద్యుత్‌. ఇందులో ఏమాత్రం సమస్య ఏర్పడినా ప్రజారవాణాకు ఆటంకాలు తప్పవు. దీంతో సంస్థకు అపవాదు సైతం వస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ సంస్థలు విద్యుత్‌ విషయంలో ముందు నుంచే పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. టీఎస్‌ ట్రాన్స్‌కో రిసివింగ్‌ సబ్‌స్టేషన్ల (ఆర్‌ఎస్‌ ఎస్‌) ద్వారా విద్యుత్‌ను తీసుకుని రైళ్లను నడిపిస్తున్న అధికారులు ఏ కారిడార్‌లో సమస్య ఏర్పడినా.. వెంటనే సమీపంలోని సబ్‌స్టేషన్‌ నుంచి కరెంట్‌ సరఫరాను తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు ఎంజీబీఎ్‌సలో ఇన్‌కమింగ్‌ ట్రాన్స్‌కో ఫీడర్‌ పరిధిలోని ఎర్రమంజిల్‌ స్టేషన్‌ లో ట్రిప్పింగ్‌ సమస్య ఏర్పడితే.. వెంటనే మియాపూర్‌ మార్గంలోని ప్రత్యామ్నాయ ఫీడర్‌ను అనుసంధానం చేసి ఈ రూట్‌లో 7 నిమిషాల్లో సమస్యను పరిష్కరించిన విషయం తెలిసిందే.

ఈదురుగాలులు వచ్చినా..!

నగరంలో ఇటీవల వర్షాలు కురుస్తున్న సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిగ్నలింగ్‌లో సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఆ సమయంలో రైళ్లు నిలిచిపోకుండా ఉండేందుకు కూడా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాత్రివేళలో ఎలివేటెడ్‌ కారిడార్‌లోని ట్రాక్షన్‌ వైర్లను పర్యవేక్షించడం, ట్రాక్‌కు సంబంధించిన నట్లు, బోల్టులు సరిచేయడం లాంటివి చేస్తున్నారు. రాత్రి 12 తర్వాత నుంచి ఉదయం 5 గంటల వరకు మెయింటనెన్స్‌ సిబ్బంది ఆయా రకాల పనులను పటిష్టవంతంగా చేస్తుండడంతో రైళ్లు ప్రశాంతంగా నడుస్తున్నాయని ఓ ఎల్‌అండ్‌టీ అధికారి తెలిపారు. వర్షాకాలంలో ప్రధానంగా తలెత్తే విద్యుత్‌ సరఫరాలో వచ్చే సమస్యలపై తాము అప్రమత్తంగా ఉంటున్నామని ఆయన చెప్పారు.

Updated Date - Jun 18 , 2024 | 03:25 PM