Share News

Gautam Gambhir: భారత కోచ్‌ అయ్యేందుకు గంభీర్‌కు అర్హత లేదు.. పాక్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 24 , 2024 | 08:52 AM

టీ20 వరల్డ్ కప్ 2024 అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోయింది. ఆ స్థానంలో గౌతం గంభీర్‌ను బీసీసీఐ నియమించింది. బాధ్యతలు కూడా స్వీకరించి శ్రీలంకతో సిరీస్ కోసం భారత్ జట్టుని తీసుకొని అతిథ్య దేశానికి వెళ్లాడు.

Gautam Gambhir: భారత కోచ్‌ అయ్యేందుకు గంభీర్‌కు అర్హత లేదు.. పాక్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు
Gautham Gambhir

టీ20 వరల్డ్ కప్ 2024 అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోయింది. ఆ స్థానంలో గౌతం గంభీర్‌ను బీసీసీఐ నియమించింది. బాధ్యతలు కూడా స్వీకరించి శ్రీలంకతో సిరీస్ కోసం భారత్ జట్టుని తీసుకొని అతిథ్య దేశానికి వెళ్లాడు. కాగా గంభీర్‌ను ఖరారు చేయడానికి కోచ్ పదవి రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. డబ్ల్యూవీ రామన్, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే గంభీర్ వైపే బీసీసీఐ పెద్దలు మొగ్గుచూపి ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని చాలా క్రికెట్ నిపుణులు, క్రికెట్ ఫ్యాన్స్ సమర్థించారు. అయితే భారత కోచ్ పదవి నిర్వహించేందుకు గౌతమ్ గంభీర్‌కు అర్హత లేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు.


గౌతమ్ గంభీర్ ‘రికమండేషన్ల’తో భారత జట్టు కోచ్ అయినట్టుగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొన్నాళ్లుగా భారత యువ క్రికెటర్లతో కలిసి పనిచేస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమించాల్సిందని వ్యాఖ్యానించాడు. ‘‘వీవీఎస్ లక్ష్మణ్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమించి ఉండాల్సింది. ఎందుకంటే అతడు చాలా కాలంగా ఇండియా-బీ జట్టు కోచ్‌గా కొనసాగుతున్నాడు. గౌతమ్ గంభీర్ నియామకం ‘రికమండేషన్ కేసు’గా ఉంది’’ అంటూ తన్వీర్ అహ్మద్ ఎక్స్ వేదికగా స్పందించాడు.


కాగా శ్రీలంకతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత జట్టు శ్రీలంక చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సారధ్యంలో భారత జట్టుకు ఇదే తొలి సిరీస్. రాహుల్ ద్రావిడ్ స్థానంలో బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్ మైదానంలో ఆటగాళ్లకు ఫీల్డింగ్ కసరత్తులు నేర్పిస్తూ కనిపించాడు. ఆటగాళ్ల ట్రైనింగ్ సెషన్ మొత్తాన్ని దగ్గర ఉండి పర్యవేక్షించాడు. ట్రైనింగ్ సెషన్‌లో ఎక్కువగా రన్నింగ్, క్యాచింగ్ కనిపించాయి. సంజూ శాంసన్‌కి గౌతమ్ గంభీర్ కొన్ని బ్యాటింగ్ చిట్కాలు నేర్పించడం, ఆల్ రౌండర్ శివమ్ దూబేతో మాట్లాడడం కనిపించాయి. ఇక టీ20 జట్టుకు నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆటగాళ్లతో సంభాషించడం మైదానంలో కనిపించింది.

Updated Date - Jul 24 , 2024 | 08:55 AM