Share News

Jay Shah: మంచి మనసు చాటిన జై షా.. ఆయనకు రూ.1 కోటి ఇవ్వాలని ఆదేశం

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:35 PM

బీసీసీఐ కార్యదర్శి జై షా తన మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయంగా రూ.1 కోటి ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి..

Jay Shah: మంచి మనసు చాటిన జై షా.. ఆయనకు రూ.1 కోటి ఇవ్వాలని ఆదేశం
Jay Shah

బీసీసీఐ కార్యదర్శి జై షా (Jay Shah) తన మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్‌కు (Anshuman Gaekwad) ఆర్థిక సహాయంగా రూ.1 కోటి ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి (బీసీసీఐ) ఆదేశాలు ఇచ్చారు. తన మాజీ సహచరుడైన గైక్వాడ్‌ను ఆదుకోవాలని మాజీ భారత వరల్డ్‌కప్ విజేత కపిల్ దేవ్ కోరిక తర్వాత జై షా ఈ చర్య తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై క్రికెట్ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.


గతంలో భారత జట్టుకి ప్రధాన కోచ్‌గా పని చేసిన గైక్వాడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఇటీవల సెలెక్టర్ సందీప్ పాటిల్ తెలిపారు. ఇది తన దృష్టికి చేరడంతో కపిల్ దేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అన్షుతో తాను ఎన్నో మ్యాచ్‌లు ఆడానని, ప్రస్తుతం అతని స్థితిని చూసి తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మైదానంలో అతను ఎన్నో భయంకర బంతుల్ని ఎదుర్కున్నాడని, ఇప్పుడు అతనికి మనం అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. అతని చికిత్సకు అవసరమయ్యే డబ్బులు అందించేందుకు బీసీసీఐ ముందుకు రావాలని, మాజీ క్రికెటర్ల సంరక్షణ కోసం బీసీసీఐ ఓ ట్రస్ట్‌ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే.. జై షా రూ.1 కోటి ఇవ్వాలని బీసీసీఐ కోరడం జరిగింది.


కాగా.. 1970లలో భారతదేశపు అత్యంత సాహసోపేతమైన ఆటగాళ్ళలో ఒకరిగా గైక్వాడ్ పేరొందారు. భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆయన.. 30.07 సగటుతో 1985 పరుగులు చేశారు. అందులో రెండు శతకాలతో పాటు 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. భారత్ తరఫున 15 వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు. తన క్రికెట్ కెరీర్‌లో 206 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఆడిన గైక్వాడ్.. జాతీయ సెలెక్టర్‌గా కూడా పనిచేశారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 03:36 PM