Share News

India vs Sri Lanka: టీమిండియా టాపార్డర్ ఊచకోత.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం

ABN , Publish Date - Jul 27 , 2024 | 09:02 PM

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌తో భారత జట్టు దుమ్ముదులిపేసింది. టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. 200 పరుగుల మైలురాయిని..

India vs Sri Lanka: టీమిండియా టాపార్డర్ ఊచకోత.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం
India vs Sri Lanka

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌తో భారత జట్టు దుమ్ముదులిపేసింది. టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. 200 పరుగుల మైలురాయిని దాటేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సూర్యకుమార్ యాదవ్ (58) చితక్కొట్టేయడంతో పాటు రిషభ్ పంత్ (49), యశస్వీ జైస్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) మెరుపులు మెరిపించడంతో.. ఆతిథ్య జట్టుకి 214 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగలిగింది.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు జైస్వాల్, గిల్ శుభారంభాన్నే అందించారు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి వాళ్లిద్దరు రప్ఫాడించడం మొదలుపెట్టేశారు. ఎడాపెడా షాట్లు కొడుతూ.. పవర్‌ప్లేని బాగా వినియోగించుకున్నారు. తొలి వికెట్‌కి వీళ్లిద్దరు 74 పరుగులు జోడించారు. క్రీజులో బాగా కుదురుకోవడం, దూకుడుగా ఆడటం చూసి.. వీళ్లిద్దరూ చెరో హాఫ్ సెంచరీ చేసుకోవడం పక్కా అని అంతా అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా వీళ్లు వెనువెంటనే వికెట్లు కోల్పోయారు. ఆరో ఓవర్‌లోని చివరి బంతికి గిల్ ఔట్ అవ్వగా.. ఏడో ఓవర్‌లోని తొలి బంతికే జైస్వాల్ పెవిలియన్ బాట పట్టాడు.


ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన సూర్య, రిషభ్ కూడా.. అదే దూకుడు కొనసాగించారు. తొలుత రిషభ్ క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయమైతే తీసుకున్నాడు. కానీ.. అటువైపున్న సూర్య మాత్రం తగ్గేదే లేదన్నట్టు బౌండరీల వర్షం కురిపించేశాడు. శ్రీలంకన్ బౌలర్లపై తన ప్రతాపం చూపించాడు. కేవలం 26 బంతుల్లోనే 58 పరుగులు చేశాడంటే.. ఎలా చెలరేగి ఆడాడో మీరే అర్థం చేసుకోండి. ఇక రిషభ్ పంత్ క్రీజులో సెట్ అయ్యాక.. తన బ్యాట్‌కి పని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇలా వీళ్లిద్దరూ వీరబాదుడు బాదడంతో.. భారత్ స్కోరు తారాజువ్వలాగా పరుగులు పెట్టింది.


అయితే.. సూర్య, పంత్ పోయాక భారత్ కాస్త గాడి తప్పింది. ఎందుకంటే.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఏ ఒక్కరూ భారీ షాట్లు కొట్టలేకపోయారు. పాండ్యా (9), రియాన్ పరాగ్ (7) తక్కువ స్కోర్లతోనే చాపచుట్టేశారు. రింకూ సింగ్ సైతం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యారు. చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ ఒక సిక్స్ కొట్టి.. భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ని ముగించాడు. శ్రీలంక బౌలర్ల విషయానికొస్తే.. మతీషా పాతిరానా 4 వికెట్లతో సత్తా చాటగా.. దిల్షాన్, వనిందు, ఫెర్నాండో తలా వికెట్ పడగొట్టారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 09:03 PM