Share News

Bharti Builders: అపార్టుమెంట్ల పేరుతో మోసం..

ABN , Publish Date - May 19 , 2024 | 03:06 AM

అతితక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ భారతి బిల్డర్స్‌ యజమానులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. వందల మంది నుంచి రూ.60 కోట్ల డబ్బు వసూలు చేసి.. బిల్డింగ్‌ కడతామన్న స్థలాన్నే అమ్మేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో భారతి బిల్డర్స్‌ చైర్మన్‌, ఎండీ, సీఈవోను సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు అరెస్టు చేశారు. ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Bharti Builders: అపార్టుమెంట్ల పేరుతో మోసం..

  • తక్కువ ధరకే ఫ్లాట్లు అంటూ ప్రచారం

  • ప్రీ లాంచ్‌ ఆఫర్‌ కింద 60 కోట్లు వసూలు

  • ఆపై ముఖం చాటేసి.. స్థలం విక్రయం

  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు

  • భారతి బిల్డర్స్‌ చైర్మన్‌, ఎండీ, సీఈవో అరెస్టు

  • పలువురి నుంచి 60కోట్ల సేకరణ

  • ఆపై ముఖం చాటేసిన సంస్థ

  • బిల్డింగ్‌ కడతామన్న స్థలం విక్రయం

  • పోలీసులకు బాధితుల ఫిర్యాదు

  • భారతి బిల్డర్స్‌ ప్రతినిధుల అరెస్టు

    హైదరాబాద్‌ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): అతితక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ భారతి బిల్డర్స్‌ యజమానులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. వందల మంది నుంచి రూ.60 కోట్ల డబ్బు వసూలు చేసి.. బిల్డింగ్‌ కడతామన్న స్థలాన్నే అమ్మేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో భారతి బిల్డర్స్‌ చైర్మన్‌, ఎండీ, సీఈవోను సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు అరెస్టు చేశారు. ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దూపాటి నాగరాజు చైర్మన్‌గా, ముల్పూరి శివరామకృష్ణ ఎండీగా, తొడ్డాకుల నరసింహారావు సీఈవోగా 2021లో భారతి బిల్డర్స్‌ పేరుతో మాదాపూర్‌లో ఒక కన్‌స్ట్రక్షన్‌ కంపెనీని ప్రారంభించారు. కొంపల్లిలో 6 ఎకరాల 23 గుంటల భూమిని సేకరించారు. అక్కడ భారతి లేక్‌ వ్యూ పేరుతో రెసిడెన్షియల్‌ అపార్టుమెంట్లు కట్టాలని నిర్ణయించారు. ముందుగా ఫ్లాట్లు బుక్‌ చేసుకున్న వారికి రూ.3,200కు ఒక చదరపు అడుగు చొప్పున విక్రయిస్తామని ప్రీ లాంచ్‌ ఆఫర్‌ను ప్రకటించారు.


తమ అనుచరుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. సుమారు 350 మంది నుంచి అడ్వాన్సుల పేరుతో రూ.50-60 కోట్లు సేకరించారు. డబ్బులు చేతికి రాగానే స్పందించడం మానేశారు. అంతేకాదు.. అపార్టుమెంట్లు కట్టడం అటుంచి.. కొంపల్లిలో అపార్టుమెంట్ల నిర్మాణం కోసం సేకరించి పెట్టుకున్న 6 ఎకరాల 23 గుంటల భూమిని వేరే వ్యక్తులకు రూ.100 కోట్లకు విక్రయించేశారు. ఎప్పటికీ అపార్టుమెంట్‌ ఊసే లేకపోయేసరికి కస్టమర్లకు అనుమానం వచ్చింది. డబ్బులు చెల్లించిన వారిలో బీవీఎస్‌ ప్రసాదరావు సహా పలువురు బాధితులు సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో ఆర్థిక నేరాల విభాగం పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ కె.ప్రసాద్‌ పర్యవేక్షణలో పూర్తి వివరాలు సేకరించి భారతి బిల్డర్స్‌ చైర్మన్‌, ఎండీ, సీఈవోలను అరెస్టు చేశారు. ప్రీ లాంచ్‌ ఆఫర్‌ అనగానే వెనకా ముందూ చూడకుండా డబ్బులు చెల్లించి మోసపోవద్దని, నమ్మకమైన నిర్మాణ సంస్థను ఎంచుకొని నిర్మాణం పూర్తయిన అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలని, మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సీపీ అవినాష్‌ మహంతి ప్రజలకు సూచించారు.

Updated Date - May 19 , 2024 | 03:06 AM