Share News

BRS Chief KCR : ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే

ABN , Publish Date - May 07 , 2024 | 06:00 AM

ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు జాతీయస్థాయిలో పూర్తి మెజారిటీ రాదని.. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. సోమవారం రాత్రి నిజామాబాద్‌ కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన

BRS Chief KCR  : ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లో

ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాదు

కమలనాథులకు 210 సీట్లు కూడా దాటవు

సబ్‌కా వికాస్‌ కాదు.. దేశం సత్తెనాశనమైంది

ఏ గ్యారెంటీనీ కాంగ్రెస్‌ అమలుచేయలేదు

14 సీట్లలో గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటాం

నిజామాబాద్‌ రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌

నిజామాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు జాతీయస్థాయిలో పూర్తి మెజారిటీ రాదని.. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. సోమవారం రాత్రి నిజామాబాద్‌ కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ చెబుతున్నట్లుగా బీజేపీకి 400 సీట్లు రావని.. 210 సీట్లు కూడా దాటవని జోస్యం చెప్పారు. కాంగ్రె్‌సకు కూడా అదే పరిస్థితి ఉందన్నారు. దేశంలో బీజేపీ హవా తగ్గిపోయిందని.. ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రధాని పలు ప్రకటనలు చేస్తున్నారని కేసీఆర్‌ దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే.. కేంద్రంతో పోరాడి, రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి జరిగే విధంగా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మోదీ హయాంలో సబ్‌కా వికాస్‌ ఎక్కడా జరగలేదు సరికదా.. దేశం సత్తెనాశనం అయిపోయిందని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బీజేపీ హయాంలో బాగా పెరిగాయని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్రమోదీ గోదావరి నీటిని తమిళనాడుకు తీసుకువెళ్తానంటున్నారని.. అదే జరిగితే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘మన గోదావరి, మన కృష్ణ నీళ్లు మనకే ఉండాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తేనే సాధ్యమవుతుంది’’ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచినా ఉపయోగం లేదని.. వారంతా మోదీ వద్ద చేతులు కట్టుకొని నిలబడతారే తప్ప రాష్ట్రానికి కావాల్సిన ఏ ఒక్క పనీ చేయలేరన్నారు. జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రధానికి ఎన్నోమార్లు విజ్ఞప్తి చేసినా ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. దేశవ్యాప్తంగా 150 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కూడా ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారని.. వచ్చాక ఒక్క గ్యారెంటీనీ అమలుచేయలేదని కేసీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో ఐదు నెలల్లోనే కరెంటు కోతలు పెరిగాయని నిప్పులు చెరిగారు. ఈ ఐదు నెలల కాలంలో రైతులకు రైతుబంధు పూర్తిస్థాయిలో ఇవ్వలేదని ఆరోపించారు. తాను రోడ్డు మీదకి వచ్చి సమావేశాల్లో పాల్గొనడంతోనే ఇప్పుడు రైతుబంధు చాలైందని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ శక్తి, తెలంగాణ బలం బీఆర్‌ఎసేనని అన్నారు. ఐదు ఎకరాలకంటే ఎక్కువ ఉంటే రైతుబంధు ఇవ్వబోమని కాంగ్రెస్‌ నేతలు ప్రకటనలు చేస్తున్నారని.. ఎక్కువ భూమి ఉన్నోళ్లు ఏం తప్పు చేశారని ఆయన ప్రశ్నించారు. తమ హయాంలో ధాన్యం కొనుగోలు సక్రమంగా చేశామని.. ఈ ఐదు నెలల పాలనలో ఎక్కడా ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో జరగడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులందరికీరూ.2 లక్షల రుణమాఫీ అయ్యేంతవరకూ బీఆర్‌ఎస్‌ గట్టిగా కొట్లాడుతుందని పేర్కొన్నారు. దేవుడిమీద ఒట్టు పెట్టుకోవడం, కేసీఆర్‌ను తిట్టడం తప్ప రేవంత్‌కు ఏం తెలియదని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. తాను ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చానని.. పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. తాను మోదీని అన్ని విషయాల్లో వ్యతిరేకించాను కాబట్టే తన బిడ్డ కవితను అరెస్టు చేశారని కేసీఆర్‌ ఆరోపించారు. అయినా.. ‘కేసీఆర్‌ ఎప్పుడూ లొంగిపోడు. ఎవరికి లొంగడు. పోరాడుతూనే ఉంటాడు’ అని వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌ జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్‌పిలుపునిచ్చారు.

రోడ్‌షోలో దొంగల చేతివాటం

నిజామాబాద్‌ నగరంలో కేసీఆర్‌ సోమవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో దొంగలు చేతివాటం చూపారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకుల జేబులు గుల్ల చేశారు. మొబైల్స్‌ తస్కరించారు. నిజామాబాద్‌జిల్లా జాగృతి మాజీ అధ్యక్షుడు అవంతిరావు సెల్‌ఫోన్‌, పర్సు కొట్టేశారు.

Updated Date - May 07 , 2024 | 06:00 AM