Share News

పసికూనపై క్యాన్సర్‌ ప్రతాపం

ABN , Publish Date - Sep 23 , 2024 | 03:40 AM

ఇంకా పాలు తాగే వయసు కూడా దాటని ఓ పసికూనపై క్యాన్సర్‌ మహమ్మారి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది.

పసికూనపై క్యాన్సర్‌ ప్రతాపం

  • ఇప్పటికే రెండుసార్లు సర్జరీ... మళ్లీ కీమో థెరపీ చేయాలన్న వైద్యులు

  • సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇంకా పాలు తాగే వయసు కూడా దాటని ఓ పసికూనపై క్యాన్సర్‌ మహమ్మారి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు సర్జరీ చేసి కణతులు తొలగించినప్పటికీ మరల చికిత్స అవసరమవుతుండటంతో వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న ఆ బిడ్డ తల్లిదండ్రులు దాతల సాయం కోసం అర్థిస్తున్నారు. తమ కూతురు ప్రాణాలు కాపాడాలని ప్రాధేయపడుతున్నారు. మునుగోడు మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన అయితగోని రవి, మమత దంపతుల ఏకైక కుమార్తె ఆరుషీ. 20 నెలల వయసున్న ఆ శిశువుకి... వెన్నెముకలో కణతి ఉండటంతో ఏప్రిల్‌ 27న మెడికవర్‌ ఆస్పత్రి వైద్యులు సర్జరీ చేసి తొలగించారు. దురదృష్టవశాత్తు తిరిగి అదే చోట మరో కణతి ఏర్పడటంతో గత నెల 20న రెండోసారి సర్జరీ చేసి దాన్ని తొలగించారు. అయితే ఈ సర్జరీ తర్వాత మళ్లీ ఇటువంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు కీమో థెరపీ చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. రెండు సర్జరీలకు ఇప్పటికే రూ. 8 లక్షలు ఖర్చయ్యాయని, మరో ఎనిమిది లక్షల దాకా అవసరమవుతుందని రవి చెప్తున్నాడు. పాప కీమో ఽథెరపీ ఒక్కసారి(ఒక సైకిల్‌)కి రూ. 1.50 లక్షల నుంచి 1.80 లక్షల వరకు వ్యయం కానుంది. ప్రైవేటు ఉద్యోగం చేసుకునే తాను ఖర్చు భరించలేకపోతున్నానని, దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నాడు. దాతలు.. అకౌంట్‌ నంబర్‌ 39905920603,ఐఎ్‌ఫఎ్‌ససీ -ఎస్‌బీఐ 011984 నంబరుకు లేదా 6300355536(అయితగోని రవి) నంబరుకు గూగుల్‌పే చేయవచ్చునన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 03:40 AM