Share News

Regional Ring Road: ఫోర్త్‌ సిటీకి అనువుగానే..

ABN , Publish Date - Aug 29 , 2024 | 03:16 AM

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరి రక్షించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

Regional Ring Road: ఫోర్త్‌ సిటీకి అనువుగానే..

  • ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌

  • పరిశ్రమల్లో పని చేసేవారికి విద్య, వైద్యం,

  • ఇతర వసతులు.. ఆ మేరకు మార్పులు

  • తొలుత రేడియల్‌ రోడ్ల భూసేకరణ

  • డ్రైపోర్ట్‌ కోసం మచిలీపట్నం, కాకినాడ

  • రేవులతో అనుసంధానంపై అధ్యయనం

  • సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరి రక్షించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. నూతనంగా ఏర్పడనున్న ఫోర్త్‌ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలకు, వాటిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి.. వారి కుటుంబాలకు విద్యా, వైద్య, ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్‌ ఉండాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం, రేడియల్‌ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిపై ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.


ఈ మేరకు సీఎం కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. గత వారం జరిగిన సమీక్షలో ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌లో ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించడంతో అధికారులు దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. అయితే ఆ అలైన్‌మెంట్‌లో కొన్ని తేడాలు ఉండటంతో మరి కొన్ని మార్పులను సూచించారు. ఆ మార్పులకు అనుగుణంగా అలైన్‌మెంట్‌ మార్చాలని... అది ఫైనల్‌ అయ్యాక వెంటనే కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.


ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకు నిర్మించాలనే ప్రతిపాదిత రేడియల్‌ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూసేకరణ చేయాలని సూచించారు. రహదారులు, ఇతర అభివృద్థి పనులకు భూ సేకరణ చేస్తున్నపుడు మానవీయ కోణంతో ఆలోచించాలని, భూ నిర్వాసితులతో సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. నిబంధనల మేరకు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏవిధమైన సాయం చేయగలమన్న అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.


  • అన్ని అంశాలను పరిశీలించాలి

డ్రైపోర్ట్‌ నిర్మాణం విషయంలో మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణనలోకి తీసుకోవాలని, తెలంగాణ ప్రయోజనాలకు ఏరకంగా మేలు జరుగు తుందనే విషయం ప్రాధాన్యంలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ అంశాలను అధ్యయనం చేశాకే గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. రైలు, జల మార్గంతో కూడిన ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వే లకు కేంద్రం ప్రాధాన్యమిస్తోందని అధికారులు తెలపగా.. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడైనా అలాంటిది ఉందా? సక్సెస్‌ రేట్‌ ఎలా ఉంది? ప్రతిపాదనలేనా.. వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందా? అనే దానిపై అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.


ఓఆర్‌ఆర్‌ -ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య రావిర్యాల నుంచి అమన్‌గల్‌ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్‌ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం.. అటవీ ప్రాంతం సమీపంలోనే ఉండటం అరుదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.


బెంగళూరులో జిందాల్‌ నేచర్‌ కేర్‌ను ఏర్పాటుచేశారని, అదే విధంగా మనదగ్గర ఉన్న అటవీ ప్రాంతం, అనుకూలతలను తెలియజేస్తే అటువంటివి ఎన్నో వస్తాయని అన్నారు. ఫోర్త్‌ సిటీలోని పరిశ్రమలకు అటవీ ప్రాంతాలను అనుసంధానిస్తే అభివృద్థి చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో యాపిల్‌ పరిశ్రమ.. యాపిల్‌ తోటలోనే ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.


ఇక రాచకొండ పరిధిలోని లోయలు... ప్రకృతి సౌందర్యం సినీ పరిశ్రమను ఆకర్షించడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆర్‌ఆర్‌ఆర్‌, రేడియల్‌ రోడ్లు, ఫోర్త్‌ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సమీకరణ విషయంలో అన్ని శాఖల అధికారులు కలిసి పని చేయాలని, ఫలితాలే లక్ష్యంగా పనితీరు ఉండాలని సీఎం అన్నారు. ప్రతి సమీక్షకు ప్రగతి కనపడాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోనని అధికారులను హెచ్చరించారు.

Updated Date - Aug 29 , 2024 | 03:16 AM