Share News

Bhupalpalli: ఆస్తి కోసం కన్న తండ్రినే కడతేర్చింది

ABN , Publish Date - Aug 18 , 2024 | 04:09 AM

ఆస్తి కోసం ఓ కుమార్తె తండ్రినే పొట్టనపెట్టుకుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్‌మార్క్స్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Bhupalpalli: ఆస్తి కోసం కన్న తండ్రినే కడతేర్చింది

  • భర్తతో కలిసి కుమార్తె దారుణం

  • రాడ్డుతో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన తండ్రి

  • చికిత్స పొందుతూ ఆయన మృతి

కృష్ణకాలనీ (భూపాలపల్లి), ఆగస్టు 17: ఆస్తి కోసం ఓ కుమార్తె తండ్రినే పొట్టనపెట్టుకుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్‌మార్క్స్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బొమ్మన లచ్చిరెడ్డి(79) భూపాలపల్లిలోని కారల్‌మార్క్స్‌కాలనీలో ఉంటున్నాడు. సింగరేణి కార్మికుడిగా పనిచేసి రిటైరైన ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రాజేశ్వరి, అల్లుడు జగన్మోహన్‌రెడ్డి భూపాలపల్లి గాంధీనగర్‌లో, చిన్న కుమార్తె మల్లేశ్వరి, అల్లుడు లక్ష్మారెడ్డి కుందూరుపల్లిలో ఉంటున్నారు.


లచ్చిరెడ్డికి ఉన్న ఆస్తి విషయంలో ఆయనకు, ఇద్దరు కూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పెద్ద కుమార్తెకే తన ఆస్తినంతా రాసిస్తానని లచ్చిరెడ్డి అనేవాడు. దీంతో మల్లేశ్వరి తండ్రిపై కోపం పెంచుకుంది. తండ్రి అనుకున్న పనిచేస్తే తనకేమీ మిగలదని భావించి ఎలాగైనా ఆయన్ను కడతేర్చాలనుకుంది. ఇందుకోసం తమకు పరిచయస్తులైన కాటారం మండలం బూడిదిపల్లికి చెందిన శనిగరం ముత్తయ్య, కాల్వల మహేష్‌, శనిగరం పులిరాజు, లింగాల శ్రీకృష్ణ సహాయం తీసుకుంది.


పథకం ప్రకారం ఈ నెల 12న ఆ నలుగురు భూపాలపల్లికి చేరుకున్నారు. లచ్చిరెడ్డిని కారులో బాంబులగడ్డకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి, ఆ మత్తులోనే మల్లేశ్వరి ఉండే కుందూరుపల్లికి తీసుకెళ్లారు. అక్కడికి చేరే సరికి తేరుకున్న లచ్చిరెడ్డి కూతురి ఇంట్లోకి వెళ్లేందుకు ససేమిరా అన్నాడు. అయితే మల్లేశ్వరి తన భర్తతో కలిసి తండ్రిని బలవంతంగా వారి ఇంటి మేడపైకి తీసుకెళ్లింది. ఇద్దరూ కలిసి లక్ష్మారెడ్డిపై రాడ్డుతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఎవరికీ అనుమానంరాకుండా భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తీసుకెళ్లారు.


మెట్ల పైనుంచి జారి పడటంతో గాయపడినట్టు వైద్యులకు చెప్పారు. అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చిన పోలీసులకు లచ్చిరెడ్డి జరిగిందంతా చెప్పాడు. లచ్చిరెడ్డి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. దీంతో మృతుడి చిన్న కుమార్తె మల్లేశ్వరి, ఆమె భర్త లక్ష్మారెడ్డితోపాటు వారికి సహకరించిన ముత్తయ్య, మహేష్‌, పులి రాజు, కృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ నరే్‌షకుమార్‌ తెలిపారు.

Updated Date - Aug 18 , 2024 | 04:09 AM