Share News

T. Harish Rao: గ్యారెంటీలకు నిధులేవి?

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:38 AM

వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులేవని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌.. ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ చేసిందని, ఇప్పుడు బడ్జెట్‌లో అంకెల గారడీ చేసింది తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

T. Harish Rao: గ్యారెంటీలకు నిధులేవి?

  • సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం: హరీశ్‌

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులేవని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌.. ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ చేసిందని, ఇప్పుడు బడ్జెట్‌లో అంకెల గారడీ చేసింది తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆసరా పింఛన్లు పెంచుతామన్నారు, బడ్జెట్‌లో మాత్రం నిధులు పెంచలేదు. ఆటో కార్మికులకు రూ.12 వేలు, రూ.4వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఊసేలేదు. కొత్త రేషన్‌ కార్డుల ప్రస్తావన లేదు. రూ.57వేల కోట్లు అప్పు తెస్తామంటున్నారు.


ఇది మా ప్రభుత్వం కన్నా రూ.17వేల కోట్లు ఎక్కువ. నెలకు రూ.7వేల కోట్ల వడ్డీ కడుతున్నామని రాష్ట్ర ఆర్థికమంత్రి చెబుతున్నారు. బడ్జెట్‌ కాపీలో మాత్రం వచ్చే ఏడాదికి చెల్లించాల్సిన వడ్డీ రూ.17,729 కోట్లని చూపించారు. ఇందులో ఏది నిజమో చెప్పాలి. ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం బడ్జెట్‌లో దానికి రూ.15,470కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులతో ఒకేసారి మాఫీ ఎలా సాధ్యం’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆత్మస్తుతి, పరనిందతప్ప ప్రభుత్వ మొదటి బడ్జెట్‌లో ఎలాంటి దశా దిశాలేదని ఆయన విమర్శించారు.

Updated Date - Jul 26 , 2024 | 04:39 AM