Share News

Fuel Shortage: పోలీసు వాహనాలకు ఇం‘ధనం’ కొరత!పోలీసు వాహనాలకు ఇం‘ధనం’ కొరత!

ABN , Publish Date - Sep 17 , 2024 | 02:36 AM

ఇలా ఒకటీ, రెండూ కాదు... రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ వాహనాలను పెట్రోల్‌, డీజిల్‌ కొరత పట్టి పీడిస్తోంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... జిల్లాల్లో నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

Fuel Shortage: పోలీసు వాహనాలకు  ఇం‘ధనం’ కొరత!పోలీసు వాహనాలకు  ఇం‘ధనం’ కొరత!

నెలల తరబడి పేరుకుపోతున్న బిల్లులు.. రామగుండంలో రూ.2కోట్లపైనే బకాయిలు

మా కమిషనరేట్‌ పరిధిలో కార్లు, ద్విచక్ర వాహనాలు కలిపి 400కుపైగా ఉంటాయి. ఆ వాహనాలకు పెట్రోల్‌, డీజీల్‌ సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. వెంట పడితే గానీ ఎప్పుడో ఒకసారి నెల బిల్లు క్లియర్‌ అవుతోంది. బంకుల్లో పెట్రోల్‌, డీజీల్‌ తీసుకోవాలంటే పడరాని పాట్లు పడాల్సి వస్తోంది.. ఇదీ ఓ కమిషనరేట్‌ ఎంటీవో ఆవేదన

మాకు ఇచ్చే డీజీల్‌... డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాల్లో సమావేశాలకు హాజరయ్యేందుకు, ఖైదీల్ని రిమాండ్‌కు పంపేందుకే సరిపోతుంది. ఇక మిగిలే అరకొర డీజీల్‌తోనే పెట్రోలింగ్‌ను నెట్టుకు రావాల్సి వస్తోంది. బిల్లులు పేరుకుపోతే కొన్ని సార్లు బంకు వాళ్లను సముదాయించేందుకు ఎంతో కొంత సొంత డబ్బు చెల్లించి బిల్లులు వచ్చాక సర్దుబాటు చేయాల్సి వస్తోంది.. ఓ జిల్లాలో ఎస్సై పరిస్థితి.

  • కరీంనగర్‌ పరిధిలో రూ.కోటిపైనే పెండింగ్‌

  • చేతులెత్తేస్తున్న బంకుల యాజమాన్యాలు

  • పెట్రోల్‌, డీజిల్‌.. అప్పివ్వమని స్పష్టీకరణ

  • సొంత డబ్బుతో పోలీసుల సర్దుబాటు

.. ఇలా ఒకటీ, రెండూ కాదు... రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ వాహనాలను పెట్రోల్‌, డీజిల్‌ కొరత పట్టి పీడిస్తోంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... జిల్లాల్లో నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. బిల్లుల భారం తడిసి మోపెడు కావడంతో కొన్ని జిల్లాల్లో బంకు యజమానులు పోలీస్‌ వాహనాలకు పెట్రోల్‌, డీజీల్‌ పోసేందుకు ససేమిరా అంటున్నారు. మంచిర్యాల జిల్లా గోదావరిఖనిలో పెట్రోల్‌ బంకు యాజామాన్య సంఘం పోలీస్‌ వాహనాలకు పెట్రోల్‌, డీజీల్‌ ఉద్దెర ఇవ్వరాదని తీర్మానించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.


దీంతో అక్కడి పోలీసుల వాహనాలకు పక్కనే ఉన్న మంచిర్యాలలో ఇంధనం నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లో పోలీస్‌ వాహనాలకు డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న పోలీస్‌ బంకులో పెట్రోల్‌, డీజీల్‌ సమకూరుస్తుంటారు. ఆయా వాహనాలకు కేటాయించిన కోటా మేరకు అక్కడ ఇంధనం పోస్తారు. కొన్ని పరిస్థితుల్లో అదనపు కోటా కేటాయించిన వాహనాలకు అదనపు కోటా ఇస్తారు. కానీ జిల్లాల్లో పరిస్థితి అలా ఉండదు. ప్రైవేటు బంకుల్లో పెట్రోల్‌, డీజీల్‌ తీసుకుని బిల్లులు చెల్లిస్తుంటారు. ఈ బిల్లులు సకాలంలో రాకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. కరీంనగర్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల తదితర ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.


ఒక్క కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలోనే రూ.కోటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రామగుండం కమిషనరేట్‌కు 8 నెలలుగా ఇంధన బిల్లుల చెల్లించకపోడంతో రూ.2 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతి పోలీస్‌ యూనిట్‌లో పీఎ్‌సలు, వాహనాల సంఖ్య, అవి తిరిగే దూరాన్ని బట్టి బడ్జెట్‌ కేటాయిస్తుంటారు. సాధారణంగా కార్లకు 120-150 లీటర్ల డీజిల్‌, ద్విచక్ర వాహనానికి 30-35 లీటర్ల పెట్రోల్‌ ప్రతి నెలా ఇస్తుంటారు. కొన్ని కమినరేట్ల పరిధిలో అదనపు కోటా కింద మరి కొన్ని లీటర్ల పెట్రోల్‌, డీజీల్‌ లభిస్తుంది. మూడు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేయాల్సి ఉన్నా.. క్రమబద్ధంగా జరగడం లేదు. సాధారణంగా జిల్లాల పరిధిలో డీఎస్పీలు, ఎస్పీల కార్యాలయాల్లో జరిగే సమావేశాలకు సీఐలు, ఎస్సైలు వెళ్లాల్సి ఉంటుంది.


వచ్చిన కోటాలో సగం వరకు సమావేశాలకు హాజరయ్యేందుకే సరిపోతుంది. ఇది కాకుండా వివిధ కేసుల్లో అరెస్ట్‌ అయ్యే నిందితుల్ని కోర్టులో హాజరు పరిచి అటు నుంచి జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించాల్సి ఉంటుంది. కోటాలో వచ్చే డీజీల్‌... సమావేశాలు, రిమాండ్లకే సరిపోతుందని, మిగిలిన కొద్ది మొత్తాన్ని స్టేషన్‌ అవసరాలు, పెట్రోలింగ్‌కు సరిపెట్టుకోవాల్సి వస్తోందని పోలీసులు వాపోతున్నారు. ఆ బకాయిలు కూడా పేరుకుపోవడంతో డీజిల్‌ నింపేందుకు బంకు యజమానులు ససేమిరా అంటున్నారు. దీంతో ఎస్సైలు తమ సొంత డబ్బును ఎంతో కొంత సర్దుబాటు చేస్తూ.. నెట్టుకొస్తున్నారు. హైదరాబాద్‌ పరిధిలో వాహన కోటా, అదనపు కోటా ఇంధనం పూర్తి అయిన తర్వాత పీఎస్‌ పరిధిలోని ప్రైవేటు పెట్రోల్‌ బంకుల్ని పోలీసులు ఆశ్రయిస్తున్నారు. ఒక్కో బంకు నుంచి అవకాశాన్ని బట్టి 10, 15 లీటర్ల వరకు తీసుకుని సర్దుబాటు చేసుకుంటున్నారు.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌

Updated Date - Sep 17 , 2024 | 02:36 AM