‘భువనగిరి’ ప్రయాణ కష్టాలు తీరుస్తా
ABN , Publish Date - May 09 , 2024 | 12:18 AM
పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే భువనగిరి ప్రజల ప్రయాణ కష్టాలు తీరుస్తానని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరిలో ఆయన రైల్వేస్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి
భువనగిరి టౌన్, మే 8: పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే భువనగిరి ప్రజల ప్రయాణ కష్టాలు తీరుస్తానని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరిలో ఆయన రైల్వేస్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైలు, బస్సు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. మార్నింగ్ వాకర్స్తో కలిసి క్రికెట్ తదితర ఆటలు ఆడి జిమ్ చేసి, హోటల్లో పూరి తిని, ఆటోలో ప్రయాణించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రం భువనగిరి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సరిపడా బస్సులు లేకపోవడం, భువనగిరిలో అన్ని రైళ్లను ఆపకపోవడం బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీ పథకాలతో మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారన్నారు. పట్టణ మౌలిక వసతులతోపాటు క్రీడా ప్రాంగణాలు, పార్కులు, అభివృద్ధి చేస్తామన్నారు. జూన్ 4వ తేదీ తర్వాత కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం పక్కా అని, భువనగిరి అభివృద్ధికోసం తనను గెలిపించాలన్నారు. ఆయనవెంట మునిసిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, సభ్యుడు తంగెళ్లపల్లి రవికుమార్, మునిసిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి, కుంభం కీర్తిరెడ్డి ఉన్నారు.