Share News

TG: రాష్ట్రంలో నేడూ వర్షాలు!

ABN , Publish Date - May 20 , 2024 | 03:41 AM

రాష్ట్రంలో సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారానికి సంబంధించి ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈనెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొన్ని జిల్లాల్లో 2 డిగ్రీల మేరకు పెరిగాయి.

TG: రాష్ట్రంలో నేడూ వర్షాలు!

  • ఎండ తీవ్రతపై 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

  • హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు

  • పిడుగుపాటుకు ముగ్గురి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారానికి సంబంధించి ఎటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈనెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొన్ని జిల్లాల్లో 2 డిగ్రీల మేరకు పెరిగాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో అత్యధికంగా 42.6, ఆదిలాబాద్‌ పట్టణం, భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమ, మంగళవారాల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.


పొద్దంతా ఎండలు.. సాయంత్రానికి వానలు !

రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. గత మూడ్రోజులుగా పొద్దంతా ఎండలు.. సాయంత్రానికి వానలు కురుస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలతో పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటల తర్వాత మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా వర్షం పడింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, బాలాపూర్‌, మేడ్చల్‌, హైటెక్‌సిటీ, బండ్లగూడ, కందికల్‌గేట్‌, శాస్ర్తిపురం, శివరాంపల్లి, లంగర్‌హౌజ్‌, గోల్కొండ, ఎస్సార్‌నగర్‌, మైత్రివనం, ఉప్పల్‌, నాచారంలో వర్షాలు కురిశాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు ఆ జిల్లాలోని బషీరాబాద్‌, తాండూరు, మోమిన్‌పేట్‌, మర్పల్లి, నవాబ్‌పేటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మెదక్‌ జిల్లా అందోల్‌లో 4.7 సెం.మీ, కౌడిపల్లిలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంతో పాటు చాలా గ్రామాల్లో వర్షం పడింది. ఇబ్రహీంపట్నం పరిధిలో మోస్తరు వర్షం పడింది. మరోవైపు, ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా అదే మండలంలోని గోపాలరావుపేట ఐకేపీ సెంటర్‌లో అంబటి సందీప్‌ అనే రైతు తన ధాన్యంపై డీజిల్‌ పోసి నిప్పంటించే ప్రయత్నం చేయగా స్థానిక రైతులు అడ్డుకున్నారు. కేంద్రానికి ధాన్యం తెచ్చి 27 రోజులైనా కొనట్లేదని సందీప్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


పిడుగుపాటుకు ముగ్గురు రైతుల దుర్మరణం

పిడుగుపాటుతో ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రెండు వేర్వేరు ఘటనలు వికారాబాద్‌ జిల్లా యాలాల మండలంలో చోటుచేసుకున్నాయి. మండలంలోని జుంటుపల్లికి చెందిన రైతులు కానింటి లక్ష్మప్ప (49), మంగలి శ్రీనివాస్‌ (28)వి పక్కపక్క పొలాలే.. వరికోత యంత్రంతో కోతలు కోయిస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. దీంతో డ్రైవర్‌తో పాటు ఇద్దరు రైతులు వరికోత యంత్రం కింద తలదాచుకున్నారు. ఇంతలో పిడుగుపడగా.. లక్ష్మప్ప, శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బెన్నూర్‌కు చెందిన గొల్ల ఎంకప్ప (60) భార్య ఎల్లమ్మతో కలిసి తమ పొలంలో ఎరువులు చల్లుతున్నారు. ఈ క్రమంలో పిడుగుపడగా.. ఎంకప్ప మృతి చెందగా, ఎల్లమ్మకు తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లిలో ఎండీ ఖాదర్‌కు చెందిన జోడెద్దులు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాయి.

Updated Date - May 20 , 2024 | 03:41 AM