‘హైటెన్షన్’ లైన్ అలైన్మెంట్ మార్చాలి
ABN , Publish Date - Oct 23 , 2024 | 11:53 PM
సాగు చేసుకుంటున్న పంట పొలాల మీదుగా హైటెన్షన్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయకుండా చూడాలని కడ్తాల గ్రామ పంచాయతీ రైతులు కలెక్టర్ శశాంకను కోరారు. హైటెన్షన్ పోల్స్ వేయడానికి చేపడుతున్న అలైన్మెంట్ను వెంటనే మార్చాలని విజ్ఞప్తి చేశారు.
కడ్తాల్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): సాగు చేసుకుంటున్న పంట పొలాల మీదుగా హైటెన్షన్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయకుండా చూడాలని కడ్తాల గ్రామ పంచాయతీ రైతులు కలెక్టర్ శశాంకను కోరారు. హైటెన్షన్ పోల్స్ వేయడానికి చేపడుతున్న అలైన్మెంట్ను వెంటనే మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్లు రామకృష్ణ, జంగారెడ్డిల ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్లో శశాంకను కలిసి వినతిపత్రం అందజేశారు. పంట పొలాల మీదుగా హై టెన్షన్ విద్యుత్ లైన్ ను ఏర్పాటు చేయకుండ చూడాలని కోరారు. మండల కేంద్రానికి 300 మీటర్ల దూరంలోనే వందల మంది రైతుల పొలాలున్నాయని తెలిపారు. గ్రామానికి 5కిలోమీటర్ల దూరంలో లైన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరినట్లు శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణలు తెలిపారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బిచ్చానాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, మాజీ ఉప సర్పంచ్ లు రాములు, అంజయ్య, వంశీ, యాదయ్యగౌడ్, బీచ్యనాయక్, మల్లిఖార్జున్ రెడ్డి, బోసు రవి, గణేశ్, రాములు, తదితరులు పాల్గొన్నారు.