Share News

Hyderabad: డీజీపీగా జితేందర్‌..

ABN , Publish Date - Jul 11 , 2024 | 03:27 AM

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ జితేందర్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్‌ డీజీగా అదనపు బాధ్యతల్లో ఉన్న జితేందర్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది.

Hyderabad: డీజీపీగా జితేందర్‌..

  • హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ జితేందర్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్‌ డీజీగా అదనపు బాధ్యతల్లో ఉన్న జితేందర్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది. బుధవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సాయంత్రం జీవో వెలువడ్డ కొద్ది సమయంలోనే జితేందర్‌ డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. ఆ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌చార్జ్‌ డీజీపీగా కొనసాగిన రవిగుప్తాను ప్రభుత్వం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) రవిగుప్తాను ఇన్‌చార్జి డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి సర్కారు కొలువుదీరాక కూడా.. ఆయన కొనసాగారు. బుధవారం డీజీపీ బదిలీ ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలో 15 మంది ఐపీఎ్‌సలను బదిలీ చేస్తూ మరో రెండు జీవోలు విడుదలయ్యాయి.


నార్కొటిక్స్‌, సైబర్‌ నేరాలపై దృష్టి..

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జితేందర్‌ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు. సైబర్‌ నేరాలు, నార్కోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు.


పంజాబ్‌లోని పిరోజ్‌పూర్‌ నుంచి..

జితేందర్‌ 1965లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జన్మించారు. జేఎన్‌టీయూ నుంచి స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీ్‌సలో పీహెచ్‌డీ పట్టా పొందారు. 1992 బ్యాచ్‌ ఐపీఎ్‌సగా విధుల్లో చేరారు. మహబూబ్‌నగర్‌, గుంటూరు జిల్లాల ఎస్పీగా, విశాఖపట్నం, వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా సేవలందించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ విభాగం అదనపు కమిషనర్‌గా ఆయన పనిచేసిన సమయంలో.. ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి సరికొత్త విధానాలను ఆవిష్కరించారు. ఆటోమెటెడ్‌ సిగ్నల్స్‌, ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మెనేజ్‌మెంట్‌ సిస్టం, సిటిజన్‌ సెంట్రిక్‌ ట్రాఫిక్‌ మెనేజ్‌మెంట్‌, నగదు రహిత చలానాల చెల్లింపు విధానాన్ని దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌లో అమలుచేశారు. అదనపు డీజీపీ(శాంతిభద్రతలు), హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేశారు. కొంత కాలం విజిలెన్స్‌ డీజీగా అదనపు బాధ్యతలను నిర్వహించారు. జితేందర్‌ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పలు పతకాలను అందజేసింది.


రాష్ట్ర పోలీసింగ్‌పై పూర్తిస్థాయిలో పట్టు

జితేందర్‌కు రాష్ట్ర పోలీసింగ్‌, పరిస్థితులపై పూర్తిస్థాయిలో పట్టుంది. శాంతిభద్రతల అదనపు డీజీపీగా ఉన్న సమయంలో కమిషనర్లు, ఎస్పీలతో పూర్తి సమన్వయంతో పనిచేసి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారు. అధికారుల పనితీరుపై జితేందర్‌కు పూర్తి అవగాహన ఉంది. హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏడాదిన్నర పనిచేసిన ఆయనకు.. పోలీసు, అగ్నిమాపక శాఖ, జైళ్లు, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌, సైనిక సంక్షేమం, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఎస్పీఎఫ్‌, ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ ఇలా.. అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పడింది. జితేందర్‌ గతంలో నిర్వహించిన పోస్టులు, ఆయనకు ఉన్న అనుభవం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఆయనను డీజీపీగా నియమించినట్లు స్పష్టమవుతోంది.


సీవీ ఆనంద్‌కు విజిలెన్స్‌ అదనపు బాధ్యతలు

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) చీఫ్‌గా ఉన్న సీవీ ఆనంద్‌కు ప్రభుత్వం విజిలెన్స్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది. విజిలెన్స్‌ డీజీగా ఉన్న రాజీవ్‌ రతన్‌ హఠాత్మరణం తర్వాత సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌కు ప్రభుత్వం ఆ బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే..! ఇప్పుడు జితేందర్‌ను డీజీపీగా నియమించడంతో విజిలెన్స్‌ డైరెక్టర్‌గా సీవీ ఆనంద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.


శాంతి భద్రతలకు మహేశ్‌ భగవత్‌

తాజా బదిలీల్లో మహేశ్‌ భగవత్‌ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు)గా నియమితులయ్యారు. రాచకొండ సీపీగా పనిచేసిన సుధీర్‌ బాబు తిరిగి అదే బాధ్యతలను చేపట్టారు. రాచకొండ సీపీగా ఉన్న తరుణ్‌ జోషీని ఏసీబీ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. మల్టీజోన్‌-1 ఐజీగా చంద్రశేఖర్‌, మల్టీజోన్‌-2 ఐజీగా వి.సత్యనారాయణ బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న రమేశ్‌ నాయుడుకు ఐజీ రైల్వే, రోడ్డు భద్రత బాధ్యతలను అప్పగించారు. ఎస్పీ(నాన్‌కేడర్‌) రాచకొండ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఉన్న చంద్ర మోహన్‌ను హైదరాబాద్‌ సౌత్‌వె్‌స్ట జోన్‌ డీసీపీగా నియమించారు. త్వరలో మరిన్ని బదిలీలు జరగనున్నట్లు సమాచారం.


బదిలీలు ఇలా..

అధికారి పేరు పోస్టింగ్‌

మహేశ్‌ భగవత్‌ ఏడీజీ

(శాంతిభద్రతలు)

స్వాతిలక్రా ఏడీజీ

(ఆర్గనైజెషన్‌, హోంగార్డ్స్‌)

విజయ్‌ కుమార్‌ ఏడీజీ (పర్సనల్‌,

వెల్ఫేర్‌, స్పోర్ట్స్‌

అదనపు బాధ్యతలు)

సంజయ్‌ కుమార్‌ జైన్‌ ఏడీజీ

టీజీఎస్పీ బెటాలియన్లు

ఎం.స్టీఫెన్‌ రవీంద్ర ఏడీజీ గ్రేహౌండ్స్‌

జి.సుధీర్‌ బాబు సీపీ రాచకొండ

డాక్టర్‌ తరుణ్‌ జోషి ఏసీబీ డైరెక్టర్‌

ఎస్‌.చంద్రశేఖర్‌ రెడ్డి ఐజీ మల్టీజోన్‌-1

వి.సత్యనారాయణ ఐజీ, మల్టీజోన్‌-2

కె.రమేశ్‌ నాయుడు ఐజీ, రైల్వే, రోడ్డు భద్రత

రక్షిత మూర్తి డీసీపీ, హెడ్‌ క్వార్టర్స్‌

డి.ఉదయ్‌ కుమార్‌ రెడ్డి మెదక్‌ ఎస్పీ

ఆర్‌.గిరిధర్‌ వనపర్తి ఎస్పీ

బి.బాలస్వామి డీసీపీ, ఈస్ట్‌ జోన్‌

జి. చంద్రమోహన్‌ డీసీపీ, సౌత్‌వె్‌స్ట జోన్‌

ఎస్పీ (నాన్‌ కేడర్‌)

Updated Date - Jul 11 , 2024 | 03:27 AM