Share News

Asha Jethwani: జెత్వానీ ఐ ఫోన్లు హ్యాక్‌!

ABN , Publish Date - Sep 20 , 2024 | 04:51 AM

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో పోలీసులు ఈ వ్యవహారంలో తప్పుల మీద తప్పులు చేశారు.

Asha Jethwani: జెత్వానీ ఐ ఫోన్లు హ్యాక్‌!

గత ప్రభుత్వంలో పోలీసుల నిర్వాకం.. తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి

  • అరెస్ట్‌ చేశాక 5 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం

  • సజ్జన్‌ను కాపాడేందుకు ఆధారాలు చెరిపేసే యత్నం

  • పాస్‌వర్డ్‌లు చెప్పాలని కాదంబరిపై ఒత్తిడి

  • ఆ సమయంలోనే వెబ్‌బ్రౌజర్‌ ద్వారా లాగిన్‌

  • దుబాయ్‌ హ్యాకర్‌ను తీసుకొచ్చినట్టు సందేహాలు

  • యాపిల్‌’ నుంచి జెత్వానీ మెయిల్‌కు మెసేజ్‌లు

  • నివేదికలో నాటి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు

  • ఆయన అనుమతితోనే ముంబైకు విశాల్‌ గున్నీ

(ఆంధ్రజ్యోతి-విజయవాడ): ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో పోలీసులు ఈ వ్యవహారంలో తప్పుల మీద తప్పులు చేశారు. అవే ఇప్పుడు వారి మెడకు చుట్టుకున్నాయి. కాదంబరి జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు ఆశా జెత్వానీ, నరేంద్రకుమార్‌ జెత్వానీ వాంగ్మూలాలతో తయారైన నివేదికలో కీలక అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానమైనది కాదంబరి ఐ ఫోన్లను హ్యాక్‌ చేయడం. ముంబైలో ఫిబ్రవరి 3వ తేదీన జెత్వానీ కుటుంబ సభ్యులను అరెస్టు చేసిన తర్వాత ఆమెకు సంబంధించిన ఐదు ఐ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పాస్‌వర్డ్‌లు చెప్పాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. అయినా కాదంబరి పాస్‌వర్డ్‌లు చెప్పలేదు. ముంబైలో న్యాయమూర్తి ఇంట్లో ఆమెను హాజరు పరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు.


కోర్టులో హాజరుపరిచిన తర్వాత కాదంబరి కుటుంబ సభ్యులను జైలుకు పంపారు. ఒక కేసులో నిందితులను అరెస్టు చేశాక వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు, నగదును కోర్టుకు అప్పగించాలి. ఈ కేసులో పోలీసులు, అధికారులు ఆ పని చేయలేదు. ముంబైలో పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌పై కాదంబరి పెట్టిన కేసు వ్యవహారం, కుక్కల విద్యాసాగర్‌కు సంబంధించిన ఆధారాలు ఫొటోలు, వీడియోలు ఈ ఫోన్లలో ఉన్నాయి. ఆ ఆధారాలను లేకుండా చేయగలిగితే ముంబై కేసులో జిందాల్‌కు విముక్తి కలుగుతుందని, విద్యాసాగర్‌ ఇబ్రహీంపట్నంలో పెట్టిన కేసులో ఆమె ఇరుక్కుపోతుందని భావించారు. కాదంబరి పాస్‌వర్డ్‌లు చెప్పకపోవడంతో ఆమె ఐదు ఐ ఫోన్లను కోర్టులో సమర్పించలేదు. పోలీసులు తమ వద్దే పెట్టుకుని హ్యాక్‌ చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన ఒకసారి, 21వ తేదీన ఒకసారి ఇది జరిగింది. వెబ్‌బ్రౌజర్‌ ద్వారా ఐక్లౌడ్‌ను ఉపయోగించినట్టు ఆమె మెయిల్‌కు యాపిల్‌ కంపెనీ నుంచి మెసేజ్‌లు వెళ్లాయి.


ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ-మెయిల్‌ను పరిశీలించగా ఈ విషయం తెలిసింది. తన ఫోన్లలో ఉన్న ఆధారాలను తుడిచేయడానికి హ్యాక్‌ చేశారని కాదంబరి గుర్తించారు. తర్వాత ఈ ఫోన్ల పాస్‌వర్డ్‌ను ఆమె రీసెట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన మెసేజ్‌ ఆమె మెయిల్‌కు వెళ్లింది. పోలీసులు తమ వద్ద పెట్టుకున్న ఆమె ఫోన్లను హ్యాక్‌ చేయడానికి ప్రత్యేకంగా దుబాయ్‌ నుంచి ఒక హ్యాకర్‌ను రప్పించినట్టు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై అంతర్గతంగా విచారణ సాగుతోంది. ఐక్లౌడ్‌ను పోలీసులు ఏవిధంగా తెరిచారన్నది లాగ్‌ వివరాలను పరిశీలిస్తే తెలుస్తుంది. బయట ఎక్కడైనా సైబర్‌ ల్యాబ్‌ నుంచి ఐక్లౌడ్‌లోకి వెళ్లారా, కమిషనరేట్‌లో కంప్యూటర్లను ఉపయోగించారా అన్నది తెలియడం లేదు. ఈ లాగ్‌ వివరాలు యాపిల్‌ సంస్థ వద్ద మాత్రమే ఉంటాయి. ఫోన్ల యజమానులు మొయిల్‌లో అప్లికేషన్‌ పంపితేనే ఆ వివరాలను యాపిల్‌ సంస్థ ఇస్తుంది. దీంతో కాదంబరి ఈ లాగ్‌ వివరాలను ఇవ్వాలని యాపిల్‌ సంస్థకు లేఖ రాయబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.


  • ఆపరేషన్‌ అక్కడ.. టీఏ బిల్లు ఇక్కడ

జెత్వానీని అరెస్టు చేయడానికి విజయవాడ నుంచి అప్పటి డీసీపీ విశాల్‌గున్నీ ఆధ్వర్యంలో ఒక బృందం ముంబై బయల్దేరి వెళ్లింది. ఫిబ్రవరి 1న విమాన టికెట్లు బుక్‌ చేసుకుని 2, 3 తేదీల్లో ఈ బృందం ముంబైలో గడిపింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కార్యాలయానికి సంబంధించిన పనులపై మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు టీఏ బిల్లు పెట్టుకుంటారు. అయితే కాదంబరి అరెస్టు ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన విశాల్‌గున్నీ పెట్టిన టీఏ బిల్లు చూసి పోలీసు వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీన విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌, నున్న, కేదారేశ్వరపేటలో పర్యటించినట్టు విశాల్‌ గున్నీ టీఏ బిల్లు పెట్టారు. 3న కూడా నగరంలోని మరికొన్ని ప్రాంతాల పేర్లు రాసి టీఏ బిల్లు పెట్టారు. ఆ సమయంలో ఆయన ముంబైలో ఉన్నారు. బిల్లులను మంజూరు చేసే పోలీసు కమిషనర్‌ కార్యాలయంలోని బీ సెక్షన్‌లో వాటిని అందజేశారు. విచారణాధికారులు అక్కడి నుంచి ఈ బిల్లులకు సంబంధించిన వివరాలు సేకరించినట్టు తెలిసింది.


  • నివేదికలో మాజీ డీజీపీ పేరు

ప్రభుత్వానికి చేరిన విచారణ నివేదికలో మాజీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు ఉన్నట్టు సమాచారం. ‘పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు... అప్పటి సీపీ కాంతిరాణాను, నన్ను సీఎం ఆఫీసుకు పిలిపించారు. అక్కడ కాదంబరి జెత్వానీ అరెస్టుకు సంబంధించి టాస్క్‌ మొత్తం వివరించారు. తర్వాత కాంతిరాణా అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. కాదంబరి కేసు అరెస్టు విషయంలో నన్ను ముంబైకు పంపుతున్నట్టు వివరించారు. దీనికి రాజేంద్రనాథ్‌రెడ్డి గోహెడ్‌ అని ఆదేశించారు’ అని విశాల్‌గున్నీ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది.


న్యాయం చేయండి

  • నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించండి

  • హోం మంత్రి అనితకు నటి జెత్వానీ వినతి

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ తనపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని ముంబై నటి కాదంబరి జెత్వానీ హోం మంత్రి అనితను కోరారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విన్నవించారు. గురువారం అమరావతి సచివాలయంలో హోం మంత్రితో ఆమె భేటీ అయ్యారు. గతంలో తనను అక్రమ కేసులో అరెస్టు చేసి మానసిక వేధింపులకు గురి చేసినందుకు తనకు ప్రభుత్వం పరిహారం ఇప్పించాలని కోరారు. తాను పెట్టిన కేసుపై త్వరితగతిన విచారణ చేయాలన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై తప్పుడు కేసు పెట్టారు. నాకు మానసికంగా, భౌతికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. నా ఫోన్లు రెండుసార్లు ఓపెన్‌ చేయడానికి యత్నించారు.


దానికి సంబంధించిన ఎలర్ట్‌ మెసేజ్‌లు వచ్చాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరాను’’ అని జెత్వానీ తెలిపారు. కాగా, జెత్వానీ కేసులో ఎంతటి వారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి అన్నారు. సచివాలయంలో కుటుంబ సభ్యులతో తనను కలిసిన జెత్వానీకి మంత్రి ధైర్యం చెప్పారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అందుకు జెత్వానీ... ప్రభుత్వం, హోం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కేసు ముగిసే వరకూ విజయవాడలో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. భద్రత విషయంలో భయపడొద్దని, లోతైన విచారణ చేసి నిందితులకు శిక్షపడే వరకూ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు సహా అందరూ అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

Updated Date - Sep 20 , 2024 | 04:51 AM