Share News

Ration cards: రేషన్‌కార్డుల దరఖాస్తులకు బ్రేక్‌..

ABN , Publish Date - Oct 03 , 2024 | 03:13 AM

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రేషన్‌కార్డులు లేనివారు ఈ నెల 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తొలుత ప్రకటించిన సర్కారు.. తాజాగా ఈ ప్రక్రియను నిలిపివేసింది.

Ration cards: రేషన్‌కార్డుల దరఖాస్తులకు బ్రేక్‌..

  • ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల నేపథ్యంలో నిర్ణయం

  • రేషన్‌ సహా అన్ని సంక్షేమ పథకాలు వీటితోనే..

  • నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల పైలట్‌ ప్రాజెక్టు

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రేషన్‌కార్డులు లేనివారు ఈ నెల 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తొలుత ప్రకటించిన సర్కారు.. తాజాగా ఈ ప్రక్రియను నిలిపివేసింది. ప్రభుత్వం నూతనంగా ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు తీసుకొస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రేషన్‌ సహా అన్ని సంక్షేమ పథకాలను ఈ కార్డుల ద్వారానే అందజేయాలని నిర్ణయించినందున.. ప్రత్యేకంగా రేషన్‌ కార్డులు అవసరం లేదన్న భావనకు సర్కారు వచ్చింది. ఈ మేరకే దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్‌ వేసింది. కాగా, ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల పైలట్‌ ప్రాజెక్టు గురువారం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక మునిసిపాలిటీని, మరో గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద తీసుకుని కార్యక్రమం చేపడుతున్నారు.


గురువారం నుంచి ఐదు పనిదినాల్లో.. కుటుంబాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అనంతరం ఈ నెల 10న పైలట్‌ ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ గుర్తింపు కార్డును ఇస్తారు. కుటుంబ పెద్దగా ఇంటి మహిళను పేర్కొంటూ కార్డు జారీ చేస్తారు. కార్డులో కుటుంబ సభ్యులందరికీ కామన్‌గా పది అంకెలను కేటాయిస్తారు. వ్యక్తిగతంగా మరో పది నంబర్ల సంఖ్యను కేటాయిస్తారు. ఇప్పటికే ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల బృందం పర్యటించి.. ఆయా రాష్ట్రాల్లోని విధానాలపై సర్కారుకు నివేదిక ఇచ్చింది. వాటన్నింటినీ పరిశీలించి తెలంగాణలో అత్యుత్తమ విధానాన్ని రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Oct 03 , 2024 | 03:13 AM