Share News

Sridhar Babu: కోచింగ్‌ కేంద్రాలపై సర్కార్‌ నియంత్రణ!

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:59 AM

కోచింగ్‌ కేంద్రాలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల భద్రత, ఫీజుల వసూలు వంటి విషయాల్లో ఒక చట్టపరమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

Sridhar Babu: కోచింగ్‌  కేంద్రాలపై సర్కార్‌ నియంత్రణ!

  • ఫీజుల నిర్ధారణపై కమిటీ

  • 1600 పాఠశాలల్లో టీచర్ల బదిలీ

  • అప్పర్‌ ప్రైమరీ స్కూళ్ల విలీనం

  • డిగ్రీలో ఉద్యోగాలిచ్చే కోర్సులు

  • పాలిటెక్నిక్‌ కాలేజీలు ఇంజనీరింగ్‌ కాలేజీలుగా అప్‌ గ్రేడ్‌

  • క్యాబినెట్‌ సబ్‌కమిటీలో దుద్దిళ్ల

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కోచింగ్‌ కేంద్రాలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల భద్రత, ఫీజుల వసూలు వంటి విషయాల్లో ఒక చట్టపరమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలిస్తున్నారు. విద్యారంగ సంస్కరణలపై సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సబ్‌ కమిటీ సభ్యురాలు మంత్రి సీతక్క, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి, ఇంటర్మీడియట్‌ విద్య డైరెక్టర్‌ శ్రుతి ఓఝా, విద్యాశాఖ స్పెషల్‌ సెక్రటరి హరిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, పోటీ పరీక్షల కోచింగ్‌ సెంటర్లు, నీట్‌, ఎంసెట్‌ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని వెల్లడించారు. కోచింగ్‌ సెంటర్లపై నియంత్రణ లేకపోవడం వల్ల అభ్యర్థుల భద్రత, ఫీజుల భారం వంటి అంశాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నట్టు తెలిపారు. కోచింగ్‌ సెంటర్ల నియంత్రణపై కేంద్రం గైడ్‌ లైన్స్‌ ను అమలు చేసి వీటిని కట్టడి చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్మీడియట్‌ కళాశాల ఫీజుల నిర్దారణపై నియంత్రణ కమిటీ ఏర్పాటు చేేస విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. అప్పర్‌ ప్రైమరీ, హైస్కూళ్లను వేర్వేరుగా నడపడం వల్ల మానవ వనరులు వృథా అవుతున్నాయని, ఈ రెండింటిని విలీనం చేేస అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు.


విద్యార్థులు లేని 1600 పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలని సూచించారు. డిగ్రీ కళాశాలల్లో బిఏ కోర్సుల పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసి విద్యార్థులను ఉద్యోగాలకు సంసిద్థం చేేసలా శిక్షణ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్‌ కాలేజీలను ఇంజనీరింగ్‌ కళాశాలలుగా అప్‌ గ్రేడ్‌ చేేస పనులను వేగవంతం చేయాలని సూచించారు. మాసబ్‌ ట్యాంక్‌, రామంతాపూర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, నల్గొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్‌, కులీకుతుబ్‌ షా పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్‌ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు. విద్యాప్రమాణాల్లో రాష్ట్రం 34వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. రెండేళ్లలో ఈ దుస్థితి నుంచి బయటపడాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. డిగ్రీ కాలేజీల్లోని పబ్లిక్‌ పాలసీ విద్యార్థులను ఏడాది పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వద్ద ఇంటర్నీలుగా పనిచేేస అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.


దీని వల్ల వారికి ప్రభుత్వ పాలనపై అవగాహన కలుగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను వినియోగించాలని కోరారు. పాలిటెక్నిక్‌, ఐటీఐ కోర్సులు చదివే విద్యార్థులకు పరిశ్రమల్లో ఆన్‌ హ్యాండ్‌ శిక్షణనిేస్త వారికి వెంటనే ఉద్యోగాలు దొరుకుతాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలు, సృజనను బయటకు తెచ్చేలా ప్రతి కళాశాల డిజిటల్‌ మ్యాగజైన్‌లను నడపాలని సూచించారు. బికాం, బిబిఏ, ఎంబిఏ విద్యార్థులకు బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల్లో శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ట్రిపుల్‌ ఐటీల్లో బయో సైన్సెస్‌, ఫార్మా కోర్సులను వచ్చే ఏడాది నుంచే ప్రవేశపెట్టేలా పాఠ్యాంశాలు రూపొందించాలని ఆదేశించారు.


  • విద్యార్థులకు అవగాహన కల్పించాలి: మంత్రి సీతక్క

విద్యార్థులను సమాజం కోసం ఆలోచించేలా తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క సూచించారు. మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలుంటాయో పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆదేశించారు. 5-6 తరగతుల టెక్ట్స్‌ బుక్‌లలో ఈ అంశాలను పాఠాలుగా చేర్చాలని తెలిపారు.

Updated Date - Sep 12 , 2024 | 03:59 AM