Share News

Uttam Kumar Reddy: రాష్ట్రవ్యాప్తంగా 773 చెరువులు, కాలువలకు గండ్లు

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:36 AM

వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 773 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని, వీటిని తాత్కాలికంగా మరమ్మతులు చేసేందుకు రూ.75 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.483 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి నివేదిక అందజేసినట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

Uttam Kumar Reddy: రాష్ట్రవ్యాప్తంగా 773 చెరువులు, కాలువలకు గండ్లు

  • తాత్కాలిక మరమ్మతులకు రూ.75 కోట్లు.. శాశ్వత పునరుద్ధరణకు రూ.483 కోట్లు

  • కేంద్ర సహాయాన్ని కోరుతూ నివేదిక

  • మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 773 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని, వీటిని తాత్కాలికంగా మరమ్మతులు చేసేందుకు రూ.75 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.483 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి నివేదిక అందజేసినట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న కాలువలు, చెరువులు, పంప్‌హౌ్‌సలతోపాటు చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో 250 మిల్లీమీటర్ల నుంచి 450 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఈ నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు.


కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం కాగితం రామచంద్రాపురం వద్ద సాగర్‌ ఎడమకాలువకు గండి పడటంతో ఆ ప్రభావం కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలపై పడిందన్నారు. ఖరీఫ్‌ పంటను కాపాడటంతో పాటు సాగునీటిని అందించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాలతో 265 చోట్ల చెరువులకు గండ్లు పడగా... 285 చెరువులు దెబ్బతిన్నాయని, ప్రాజెక్టులకు చెందిన 131 కాలువలకు గండ్లు పడగా 83 దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివర కు 94 భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయన్నారు. కాగా నాగార్జునసాగర్‌ ఎడమకాలువ పునరుద్ధరణ పనులతోపాటు ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌, రెడ్లకుంట, మఠంపల్లి మండలంలోని చెరువులను స్వయంగా పరిశీలించేందుకు ఆదివారం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.


  • 20న ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పరిశీలన

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు టన్నెల్‌ పనులను పరిశీలించేందుకు ఈనెల 20న నల్గొండ జిల్లా పర్యటనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెళ్లనున్నారు.

Updated Date - Sep 15 , 2024 | 03:36 AM