Dalai Lama : దలైలామాపై గూఢచర్యం... చైనా మహిళ అరెస్ట్...

ABN , First Publish Date - 2022-12-29T19:46:23+05:30 IST

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Tibetan spiritual leader Dalai Lama)పై గూఢచర్యం చేస్తున్నట్లు

Dalai Lama : దలైలామాపై గూఢచర్యం... చైనా మహిళ అరెస్ట్...
Dalai Lama, Song Xiaolan

పాట్నా : టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Tibetan spiritual leader Dalai Lama)పై గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానంతో చైనా జాతీయురాలు సోంగ్ షియావోలన్ (Song Xiaolan)ను బిహార్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే కాలచక్ర మైదానం వెలుపల ఆమెను అరెస్ట్ చేశారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) హెచ్చరిక నేపథ్యంలో బిహార్ పోలీసులు ఆమె రూపురేఖలతో కూడిన స్కెచ్‌ను కూడా విడుదల చేశారు.

చైనా జాతీయురాలు సోంగ్ వల్ల టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ముప్పు ఉన్నట్లు ఎంఈఏ హెచ్చరించడంతో బిహార్ పోలీసులు ఆమె రూపురేఖలతో కూడిన ఓ స్కెచ్‌ను విడుదల చేశారు. దలైలామా గత గురువారం నుంచి బిహార్‌ (Bihar)లోని బుద్ధ గయ (Bodh Gaya)లో పర్యటిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్ళపాటు ఆయన ఈ సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంలో పర్యటించలేదు. అంతకుముందు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి, ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. గత గురువారం ఆయనకు గయ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్‌ప్రీత్ కౌర్, ఆయన అనుచరులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన టిబెటన్ మానెస్టరీకి వెళ్ళే వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని, అభివాదం చేస్తూ స్వాగతం పలికారు.

దలైలామా డిసెంబరు 29 నుంచి 31 వరకు కాలచక్ర మైదానంలో ఉపన్యాసాలు ఇస్తారు. ఆయన భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 2018 జనవరిలో ఇక్కడ తక్కువ తీవ్రతగల పేలుడు జరిగిన నేపథ్యంలో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఉపన్యాసాల కోసం ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది వస్తారు, అందువల్ల కోవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజారోగ్య శాఖ కోరింది.

విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, బిహార్ పోలీసులు అరెస్టు చేసిన సోంగ్ తన భర్త నుంచి విడాకులు పొందినట్లు తెలుస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం. ఆమె గతంలో భారత దేశానికి వచ్చి, 2019లో తిరిగి చైనాకు వెళ్ళిపోయినట్లు, ఆ తర్వాత మళ్లీ భారత దేశానికి వచ్చి, అక్కడి నుంచి నేపాల్‌ వెళ్లారని, కొద్ది రోజులపాటు ఆ దేశంలో ఉన్న తర్వాత తిరిగి బిహార్‌లోని బుద్ధ గయకు వచ్చారని తెలుస్తోంది.

Updated Date - 2022-12-29T19:46:40+05:30 IST