Chintan Shivir : ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫాం : మోదీ

ABN , First Publish Date - 2022-10-28T12:13:12+05:30 IST

ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Chintan Shivir : ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫాం : మోదీ
Narendra Modi

న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ, దీనికి దేశ సమైక్యత, అఖండతలతో కూడా సంబంధం ఉంటుందని చెప్పారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో రాష్ట్రాల హోం మంత్రులతో శుక్రవారం జరిగిన మేధోమథనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. సహకారాత్మక సమాఖ్యతత్వానికి ఈ చింతన్ శిబిరం (Chintan Shivir) అసాధారణ ఉదాహరణ అని తెలిపారు.

రాష్ట్రాలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవచ్చునని, పరస్పరం ప్రేరణ పొందవచ్చునని, కలిసికట్టుగా భారత దేశ అభివృద్ధి కోసం పాటుపడవచ్చునని తెలిపారు. ఇది రాజ్యాంగ భావన అని, ప్రజల పట్ల మనకు కల కర్తవ్యమని వివరించారు. ‘ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫాం’ సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్చించాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని తెలిపారు. నేరగాళ్ళు దేశ సరిహద్దుల ఆవలి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పని చేయవలసిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు.

ఇటువంటి నేరాల విషయంలో పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సమానంగా స్పందన రానంత వరకు, అన్ని రాష్ట్రాలు వీటిపై పోరాటానికి కలిసిరానంత వరకు, వీటిని ఎదుర్కొనడం అసాధ్యమని చెప్పారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ మేధోమథనం సదస్సు రెండు రోజులపాటు జరుగుతుంది. అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై విధానాల రూపకల్పనకు జాతీయ దృక్పథాన్ని కల్పించేందుకు చేసే ప్రయత్నమే ఈ సదస్సు. పోలీసు దళాల ఆధునికీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మరింత ఎక్కువగా వాడటం, భూ సరిహద్దుల నిర్వహణ, తీర ప్రాంత భద్రత, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, హోం మంత్రులు పాల్గొన్నారు.

అమిత్ షా గురువారం ఈ సమావేశాల్లో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఈ మేధోమథనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశం ముందు ఉన్న సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల వ్యాప్తి, క్రాస్ బోర్డర్ టెర్రరిజం వంటి సవాళ్ళను ఎదుర్కొనడం కోసం ఉమ్మడి వేదికను ఈ సదస్సు అందజేస్తుందని చెప్పారు.

Updated Date - 2022-10-28T12:17:54+05:30 IST