NRI Success Story: 20 ఏళ్ల క్రితం రూ.10 వేలతో భారత్ నుంచి అమెరికాకు.. నేడు 700 మందికి యజమాని..!

ABN , First Publish Date - 2022-12-20T13:32:43+05:30 IST

మనం ఇప్పుడు చెప్పుకుబోయే ఈ భారతీయుడి (Indian) కథ.. సినిమా స్టోరీని ఏ మాత్రం తీసిపోదు.

NRI Success Story: 20 ఏళ్ల క్రితం రూ.10 వేలతో భారత్ నుంచి అమెరికాకు.. నేడు 700 మందికి యజమాని..!

ఎన్నారై డెస్క్: మనం ఇప్పుడు చెప్పుకుబోయే ఈ భారతీయుడి (Indian) కథ.. సినిమా స్టోరీని ఏ మాత్రం తీసిపోదు. కేవలం తన స్వయం కృషితోనే అంచలంచెలుగా ఎదిగి ఇవాళ అగ్రరాజ్యంలో పిజ్జా బిజినెస్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. 20 ఏళ్ల క్రితం చేతిలో కేవలం రూ.10 వేలతో భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన అతడు ఇవాళ 700 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అతడే సునీల్ సింగ్ (Sunil Singh). అమెరికాలో అందరూ పిజ్జా కింగ్ (Pizza King) అంటారు. పాపా జాన్స్ పిజ్జా (Papa John's Pizza) ఓనర్. దీనికి 38 బ్రాంచీలు ఉన్నాయి. వీటిలో 700 మంది వరకు పని చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం రూ.10వేలతో వెళ్లిన వ్యక్తి నేడు కోటీశ్వరుడిగా ఎలా మారాడు? అసలు ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటరిగా ఎలా నెలకొల్పాడు? దీని కోసం సునీల్ సింగ్ ఎన్ని వ్యయప్రయాసాలను ఎదుర్కొన్నాడు? అనే విషయాలు తెలియాలంటే మనం అతని సక్సెస్ స్టోరీ పూర్తిగా తెలుసుకోవాల్సిందే.

అది 1994 సంవత్సరం. సునీల్ సింగ్ భారత్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఓ సమీప బంధువు గ్రీన్‌కార్డు (Green Card) స్పాన్సర్ చేయడంతో అమెరికా వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక మనోడికి ఏ ఉద్యోగం దొరకలేదు. చివరికి చేసేదేమిలేక రెస్టన్‌లోని ఓ రెస్టారెంట్‌లో కుక్‌గా చేరాడు. అలా అక్కడ పని చేస్తూనే 1999లో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సీస్టంలో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. కానీ, ఆర్థిక మాంద్యం కారణంగా ఆ కంపెనీ కొంతకాలానికి సునీల్‌ను జాబ్ నుంచి తీసేసింది. దాంతో మళ్లీ రోడ్డున పడ్డాడు. ఆ సమయంలో సునీల్‌కు సొంత పిజ్జా బిజినెస్ ఐడియా వచ్చింది. కానీ, దానికి పెట్టుబడి కావాలి. అప్పటికి అతని చేతిలో వ్యాపారం మొదలెట్టడానికి కావాల్సినంత డబ్బులు లేదు. దాంతో పిజ్జా డెలివరీ బాయ్‌గా చేరాడు. అలా మూడేళ్లు కష్టపడి 2మిలియన్ డాలర్లు సంపాదించారు.

2002లో పాపా జాన్స్ పిజ్జా పేరిట ఓ బ్రాంచీ ఓపెన్ చేశారు. ఆ తర్వాత సునీల్ సింగ్‌కు పిజ్జా వ్యాపారం బాగానే కలిసొచ్చింది. ప్రస్తుతం పాపా జాన్స్ పిజ్జాకు 38 ఫ్రాంచేజీలు ఉన్నాయి. వాటిలో 700 మంది వరకు పని చేస్తున్నారు. ఇక భారత కమ్యూనిటీకి సంబంధించిన ఏవైనా వేడుకలు ఉంటే వాటికి ఉచితంగా పిజ్జాలు అందిస్తుంటానని సునీల్ తెలిపారు. దాంతో అక్కడ అందరూ తనను పిజ్జా కింగ్ అని పిలుస్తుంటారని చెప్పారు. ఈ సందర్భంగా సునీల్ కొత్తగా బిజినెస్ మొదలెట్టాలనుకునే వారికి కీలక సూచన చేశారు. ఎట్టిపరిస్థితిలో కూడా వ్యాపారం కోసం అప్పు చేయకూదట. ఒకవేళ తప్పనిపరిస్థితిలో చేయాల్సి వస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తీర్చేయాలనేది సునీల్ సూచన. అలాగే పనిలో చిన్న పెద్ద అనేది ఉండదని, ఏ పని అయిన చేయడానికి రెడీ ఉండాలని చెప్పారు. దానికి తాను పిజ్జా డెలవరీ బాయ్ నుంచి ఇవాళ కోట్ల వ్యాపారాన్ని సృష్టించిన విధానాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-12-20T13:33:56+05:30 IST