Sukesh Chandrasekhar: సీఎంపై సంచలన ఆరోపణలు, ఎల్జీకి లేఖ

ABN , First Publish Date - 2023-01-13T14:26:53+05:30 IST

రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు...

Sukesh Chandrasekhar: సీఎంపై సంచలన ఆరోపణలు, ఎల్జీకి లేఖ

న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar) మరోసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Vinai Kumar Saxena)కు లేఖ రాశారు. ఈ లేఖలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ (Satyendra Jain)పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఇరువురూ తనను మానసికంగా వేధించడంతో పాటు బెదిరించారని అన్నారు. తమపైన, తమ సన్నిహితుల పైన చేసిన ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని సత్యేంద్ర జైన్ తనను బెదిరించినట్టు తెలిపారు.

''జైల్ అధికారులు, వారి విధేయులైన జైలు సిబ్బందితో కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ నన్ను వేధించి, బెదిరించారు. నెలరోజుల క్రితం జైల్-14లో ఉన్నప్పుడు నన్ను బెదరించేందుకు సత్యేంద్ర జైన్ తనకు విశ్వాసపాత్రుడైన సూపరింటెండెంట్ రాజేందర్, డిప్యూటీ సూపరింటెండెంట్ జే సింగ్‌ను పంపించారు. అయితే వారి బెదిరింపులు, ఒత్తిడికి నేను లొంగలేదు'' అని ఎల్జీకి రాసిన లేఖలో చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలను తిరిగి ఇచ్చివేయడానికి ఇదే చివరి అవకాశం అని జైన్ చెప్పించారని, ఉన్నతాధికారుల కమిటీకి, మీడియాకు ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఉపసహరించుకుని తనకు వ్యతిరేకంగా ఉన్న ఛాట్‌లు, స్కీన్‌షాట్‌లు, వాయిస్ రికార్డింగ్‌లు ఇచ్చివేయాలని డిమాండ్ చేశారని, ఇందుకు ప్రతిగా కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికల్లో సీటు కానీ, పంజాబ్‌లో మైనింగ్ కాంట్రాక్ట్ కానీ ఇస్తామని ఆఫర్ చేశారని చంద్రశేఖర్ ఆ లేఖలో ఎల్జీ దృష్టికి తెచ్చారు. అప్పటికీ తన డిమాండ్ ఒప్పుకోకుంటే మండోలిలోని ఒక జైలు నుంచి మరో జైలుకు ట్రాన్‌ఫర్ చేయిస్తామని ఆయన (జైన్) తనను హెచ్చరించారని అన్నారు. మరో 48 గంటలు గడువు ఇస్తున్నామని, అప్పటికీ కాదంటే విపత్కరపరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని తనను హెచ్చరించినట్టు చెప్పారు.

కాగా, తనను జైల్-14 నుంచి జైల్-13కు అకారణంగా బదిలీ చేశారని జనవరి 7న చంద్రశేఖర్ ఆరోపించారు. జైలు-14తో పోల్చుకుంటే జైలు-13లో కరడుకట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లు ఉన్నారని, జైలు-14లో 250 మంది ఖైదీలుంటే జైలు-13లో 1,600 మంది ఉన్నారని ఆయన తెలిపారు.

ఆప్ నేతలపై దర్యాప్తునకు డిమాండ్

ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఎల్‌జీని చంద్రశేఖర్ కోరారు. కేజ్రీవాల్, ప్రధానంగా జైన్ ఎంతటికైనా తెగించవచ్చనే ఆందోళన ఉందని ఆయన అన్నారు.

Updated Date - 2023-01-13T14:26:55+05:30 IST