Howrah Clashes: హౌరాలో హింసాకాండపై గవర్నర్‌కు అమిత్‌షా ఫోన్..!

ABN , First Publish Date - 2023-03-31T19:18:36+05:30 IST

శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో గురువారం జరిగిన అల్లర్లు..

Howrah Clashes: హౌరాలో హింసాకాండపై గవర్నర్‌కు అమిత్‌షా ఫోన్..!

న్యూఢిల్లీ: శ్రీరామ నవమి (Sri Rama Navami) శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని హౌరా (Howrah)లో గురువారం జరిగిన అల్లర్లు, హింసాకాండపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shaa) ఆరా తీశారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ (CV Ananda Bose), ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ (Sukanta Majumdar)కు శుక్రవారం సాయంత్రం ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హౌరాలో రెండు వర్గాల మధ్య గురువారం పెద్దఎత్తున ఘర్షణలు చేలరేగాయి. ఆందోళనకారులు వాహనాలను తగులబెడుతూ, రాళ్లు రువ్వుతూ, దుకాణాలను కొల్లగొడుతూ విధ్వంసం సృష్టించారు. పలు పోలీసు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఘర్షణలు చెలరేగిన ప్రాంతంలో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో అల్లర్లు జరిగిన ప్రాంతంలో గవర్నర్‌ పర్యటించనున్నారు. ఇదే సమయంలో అల్లర్లకు దారితీసిన కారణాలు, ప్రస్తుత పరిస్థితిని అమిత్‌షాకు గవర్నర్‌ ఫోనులో వివరించినట్టు తెలుస్తోంది.

రాత్రంతా సోదాలు, 36 మంది అరెస్టు

ఘర్షణలతో అట్టుడిగిన కాజిపరలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రంతా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు, సోదాలు చేపట్టారు. ఇంతవరకూ 36 మందిని అరెస్టు చేశారు. పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ, షిబ్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం తాజాగా మరో హింసాత్మక ఘటన వెలుగుచూసింది. ట్రాఫిక్ కోసం ఓ రోడ్డును తెరిచిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది. దీనిపై బీజేపీ, టీఎంసీ పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి.

కఠిన చర్యలు...మమత

హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. శోభాయాత్ర సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించినట్టు ఆమె ఆరోపించారు. మత ఘర్షణలు సృష్టించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కిరాయి గూండాలను బీజేపీ తీసుకువచ్చిందన్నారు. ''వాళ్లు రూటు ఎందుకు మార్చారు. అనధికార రూట్‌ను ఎంచుకోవడం ద్వారా ఒక వర్గంపై దాడిని వాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఇతరులపై దాడి చేసి, న్యాయపరమైన జోక్యం ద్వారా ఉపశమనం కలిగించాలని వారు అనుకుంటే ప్రజలే ఒకరోజు వాళ్లను తిప్పికొడతారనే నిజం గ్రహించాలి'' అని మమత అన్నారు.

అభిషేక్ సంచలన ఆరోపణలు, ఎన్ఐఏ దర్యాప్తునకు బిజేపీ డిమాండ్..

కాగా, బీజేపీనే అల్లర్లను ప్రోత్సహించిందని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ''తుపాకులు, పిస్తోళ్లతో రామ నవమి ర్యాలీ ఎలా జరిగింది? కొందరు వ్యక్తులు పిస్తోళ్లతో ర్యాలీలో పాల్గొన్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది'' అని ఆయన అన్నారు. పార్టీ అగ్రనాయకత్వం సాయంతో బీజేపీ నేత సువేందు అధికారి ఈ హింసకు వ్యూహం పన్నారని ఆయన ఆరోపించారు. ''ఆయన (సువేందు అధికారి) కేంద్ర హోం మంత్రిని ఢిల్లీలో కలిసారు. తిరిగి కోల్‌కతా వచ్చారు. ఆ మరుసటి రోజు పబ్లిక్ మీటింగ్ పెట్టారు. అందరూ మరుసటి రోజు టీవీలు చూడండని చెప్పారు. సరిగ్గా ఆయన చెప్పిన రోజే అల్లర్లు జరిగాయి. సంఘటన పరిణామ క్రమం ఇదే'' అని అభిషేక్ తెలిపారు. కాగా, తాజా అల్లర్ల నేపథ్యంలో కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాలని, ఎన్ఐఏ చేత దర్యాప్తు పశ్చిమబెంగాల్ బీజేపీ డిమాండ్ చేసింది.

Updated Date - 2023-03-31T19:20:35+05:30 IST